చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 9 : మాజీ సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె మూడోవార్డులో బస్తేపురం మాధురీశ్రీశైలం, ఐదోవార్డులో దేవులపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆరోవార్డులో కావలి లక్ష్మీరవీందర్ యాదవ్, ఏడో వార్డులో మంగమ్మామల్లేశ్లకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. ఇప్పుడు మాట మార్చి తప్పించుకుంటున్నదని దుయ్యబట్టారు. రైతు భరోసా, మహిళల సంక్షేమం, యువతకు ఉద్యోగాలు అన్ని కాగితాలకే పరిమితమయ్యాయని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, రేవంత్ పాలన దారుణంగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ హామీల డ్రామాకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ పాలననే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని పేరొంటూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మిట్ట లతాదేవి, బీఆర్ఎస్ సెగ్మెంట్ మాజీ ఇన్చార్జి దేశమొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ బీసీ మండలాధ్యక్షుడు రాములు, కమ్మెట మాజీ సర్పంచ్ హన్మంత్రెడ్డి, వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సిములు, బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, శేఖర్రెడ్డి, సుదర్శన్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.