తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. పలు గ్రామాల గణనాథుల ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బ్యాండు చప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య గణపయ్య శోభాయాత్రలు కొనసాగాయి. అడుగడుగునా గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణపతి…జై జై గణపతి.., గణపతి బొప్పా మోరియా ఆదాలడ్డూ కాలియా.. అంటూ భక్తులు నినాదాలు చేశారు. తాండూరు పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తదితరులు గణపతి భక్తులకు పూలు, రంగులు చల్లుతూ స్వాగతం పలికి, వీడ్కోలు తెలిపారు. ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
– తాండూరు, సెప్టెంబర్ 22
తాండూరు, సెప్టెంబర్ 22 : నియోజకవర్గంలో ఐదురోజులు ఘనమైన పూజలందుకున్న గణపయ్యకు శుక్రవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగురంగుల కాగితాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలను ఉంచి ఊరూరా కనులపండువగా శోభాయాత్రలు నిర్వహించారు. దారి పొడవునా భజనలు, బ్యాండు చప్పుళ్లు, నృత్యాల హోరుతో వైభవంగా సాగిన నిమజ్జనంలో అడుగడుగునా గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణపతి…జై జై గణపతి.., గణపతి బొప్పా మోరియా ఆదా లడ్డూ కాలియా అంటూ భక్తులు, యువతీయువకులు చేసిన నినాదాలు మిన్నంటాయి. తీన్మార్ డ్యాన్సులు, ప్రత్యేక డోలు, బ్యాండ్, డప్పుల చప్పుళ్లు, అతివల కోలాటం, చిన్నారుల కేరింతల మధ్య విఘ్నేశుడిని వాగులు, చెరువులు, బావిల్లో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేసి ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.
హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నిమజ్జన మ హోత్సవం కనుల పండువగా జరిగింది. సాయం త్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం తెల్లవారు జామువరకు కొనసాగింది. ప ట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు సంబురాలు అంబరాన్నంటా యి. మండపాల నిర్వాహకులు పెద్ద ఎత్తున సాం స్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బోనాలు, భక్తజన మండలి సభ్యులతో భజనలు నిర్వహించారు. సామూహిక నిమజ్జన ఊరేగింపును తిలకించేందుకు తాండూరు పట్టణంతోపాటు డివిజన్ పరిధిలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్తోపాటు జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో రోడ్లు జనసంద్రంగా మా రాయి. పట్టణంలోని గంజ్ కూడలి (మర్రి చెట్టు) నుంచి వినాయకుల సామూహిక ఊరేగింపు ప్రా రంభమై గాంధీచౌక్, భద్రేశ్వరచౌక్, మార్వాడీ బజార్, రైల్వేస్టేషన్, శాంతిమహల్ చౌరస్తా, వినాయకచౌక్, ఇంద్రాచౌక్, అంబేద్కర్చౌక్ మీదుగా యాలాల మండలంలోని కోకట్ (నిమజ్జన స్థలం) వరకు కొనసాగింది.
కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి నర్సింహు లు, రాజకీయ పార్టీల నేతలు, పట్టణ పురప్రముఖులు భద్రేశ్వరచౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి పూలు, రంగులు చల్లుతూ వినాయకులకు ఘనస్వాగతం పలుకుతూ వీడ్కోలు చెప్పా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా .. వినాయకుల నిమజ్జనం ప్రశాంతంగా జరిగే లా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు విధులు నిర్వహించారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్, రెవెన్యూ, వైద్యారోగ్య, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పాత తాండూరుగడిలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహ నిమజ్జనాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హిందూముస్లిం లు కలిసి గణపయ్య నిమజ్జనాన్ని ఘనంగా నిర్వ హించి మతసామరస్యాన్ని చాటారు. గడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ముస్లింలు నిలబడి గణనాథుడి ప్రతిమలపై పువ్వులు చల్లుతూ ఘనస్వాగతం పలుకుతూ వీడ్కోలు చెప్పారు.