షాబాద్, జూలై 14: విద్యార్థుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ ఇబ్బందులు పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. తమ పిల్లలను బూతుమాటలు తిడుతూ కాళ్లతో తన్నిన హెచ్ఎం గోవింద్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని భీష్మించి కూర్చున్నారు. వీరికి పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత, పిడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మద్ధతు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఈఓ ఇక్కడికి వచ్చేదాకా తగ్గేది లేదని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు హుటాహుటిన షాబాద్ పాఠశాలకు చేరుకున్నారు.
అనంతరం అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో కొద్దిసేపు సమావేశం నిర్వహించుకుని హెచ్ఎం గోవింద్పై వస్తున్న ఆరోపణలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు మాట్లాడుతూ..షాబాద్ బాలుర పాఠశాలలో విద్యార్థిపై హెచ్ఎం చేయి చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పాఠశాలను సందర్శించి వివరాలు తీసుకున్నామన్నారు. గతంలో కూడా హెచ్ఎంపై పలు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని వాటిపై కూడా విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గోవింద్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అతడి స్థానంలో మరో ఉపాధ్యాయుడికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం షాబాద్ కేజీబీవీ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, సమయపాలన పాటించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈఓ లక్ష్మణ్నాయక్, సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.