బడంగ్పేట : తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పెద్ద గ్యారంటీ ఉండగా వారంటి (Warranty) లేని కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలకు ఎందుకని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy ) ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు(Gurantees) అక్కడ అమలు చేయడంలో విఫలం చెందగా తెలంగాణలో అమలు చేస్తామని ఇస్తున్న హామీలను ప్రజలు ఎవరూ కూడా నమ్మడం లేదని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆమె ఆదివారం రోడ్ షో (Road Show) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఇస్తున్న మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికల తరువాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని దుయ్యబట్టారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు, దేశానికి ఆదర్శమని అన్నారు. ‘‘ తెలంగాణలో అభివృద్ధి జరగని ఊరు లేదు.. సంక్షేమం అందని గడప లేద’’ న్నారు. నియోజక వర్గంలో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ జెండాను మరోసారి ఎగుర వేస్తామన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు ఓట్లేసి అండగా ఉంటామని ప్రజలు స్పష్టంగా హామీ ఇస్తున్నారని ఆమె తెలిపారు.
కారు గుర్తుకు ఓటు వేస్తామని, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని కాలనీలలో ఏక గ్రీవ తీర్మానాలు చేయడం ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరికలు ..
మహేశ్వరం మండల పరిధిలోని రామారావు తండాకు చెందిన 30 మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, సీనియర్ నాయకుడు దేవ్లా నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజక నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని అన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు.