Ration Cards | పరిగి, జూలై 20: ప్రభుత్వం కొత్తగా తెల్లరేషన్కార్డులను అందజేస్తుందని ఊరూరా తిరిగి అధికార పార్టీ నాయకులు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేస్తుండగా వాటికి రేషన్ కోటా కేటాయింపులు ఇప్పటివరకు జరగకపోవడంతో బియ్యం ఎపుడు ఇస్తారని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇటీవల తెల్ల రేషన్కార్డులు జారీ చేసింది. మే 25వ తేదీ లోపు మంజూరైన వాటికి జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేషన్ బియ్యం అందజేశారు.
వికారాబాద్ జిల్లాలో 2.41లక్షల పైచిలుకు తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ జూన్ నెలాఖరు లోపు మూడు నెలల బియ్యం పంపిణీ చేపట్టారు. మే 25వ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్కార్డులు మంజూరు చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఈనెల 14వ తేదీన కొత్త రేషన్కార్డుల పంపిణీని ప్రారంభించగా.. వికారాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలను లబ్దిదారులకు అందజేస్తున్నారు.
కొద్ది రోజుల వ్యవధిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనే ఉద్దేశంతో హడావిడిగా రేషన్కార్డుల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేపట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17,563 కొత్త రేషన్కార్డులు ఇటీవల మంజూరు చేశారు. వాటిలో వికారాబాద్ నియోజకవర్గానికి 3267 రేషన్కార్డులు, పరిగి నియోజకవర్గానికి 5629 కార్డులు, కొడంగల్ నియోజకవర్గానికి 2579 కార్డులు, తాండూరు నియోజకవర్గానికి 6021కార్డులు, చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట మండలానికి 67 తెల్ల రేషన్కార్డులు మంజూరు చేశారు. ఈ మేరకు ఆయా మండలాల పరిధిలోని గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యేల చేతులమీదుగా రేషన్కార్డుల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేపడుతున్నారు.
రేషన్ బియ్యం ఎపుడు కేటాయిస్తారు ?
కొత్తగా రేషన్కార్డులు మంజూరు చేశామని పాలకులు ఊరూరు తిరిగి ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేపడుతుండగా కొత్త కార్డులకు బియ్యం కేటాయింపులు ఇప్పటివరకు జరగకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తుండగా ఇప్పటికే పాత కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ పూర్తయింది. దీంతో కొత్తగా మంజూరు చేయబడిన రేషన్కార్డుదారులు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్న తరుణంలో కొత్త రేషన్కార్డుదారులకు బియ్యం కోటా కేటాయింపులు చేపట్టడంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే జూలై 20వ తేదీ దాటిపోయింది. కనీసం ఈ రెండు మూడు రోజులలో బియ్యం కేటాయింపులు జరిపితే ఈ నెల, ఆగస్టు నెల కోటా బియ్యం కార్డుదారులకు అందజేసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా నెలాఖరు వరకు కోటా కేటాయింపులు జరపకపోతే, మధ్యలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలైతే కొత్త కార్డులకు బియ్యం కోటా కేటాయింపు కష్టసాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు అంశంలో ఎన్నికల సంఘం అనుమతి వరకు వెళ్తుందని, అపుడు ఎన్నికల సంఘం కోటా కేటాయింపుకు అనుమతులు ఇస్తుందో, ఇవ్వదో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.
ఎన్నికల సంఘం కొత్త కార్డులకు బియ్యం కేటాయింపులు ఇపుడే వద్దని చెబితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కొత్త కార్డులకు బియ్యం కోటా కేటాయింపులు నిలిచిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఆదరాబాదరాగా కార్డుల పంపిణీ చేపడుతున్న ప్రభుత్వం ఆ కార్డులకు బియ్యం కేటాయింపులపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం విడ్డూరం. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను అడుగగా కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు అంశం ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశం తమ చేతిలో లేదని, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు చేపట్టాలని కోరుతున్నారు.