పరిగి : గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన కంపోస్టు షెడ్లు ఉపయోగంలోకి తీసుకురావాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు షెడ్లు నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ షెడ్లు ఎందుకు ఉపయోగించడం లేదని, సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏమి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతి నాలుగైదు గ్రామ పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఈ షెడ్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
తడి, పొడి చెత్త వేర్వేరు చేసి చెత్త సేకరణ వాహనాలలో వేసేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. గతంలో ఏ గ్రామానికి వెళ్లినా పెంటకుప్పలు దర్శనమిచ్చేవని, ప్రస్తుతం రోడ్డు పక్కన మొక్కలు కనిపిస్తున్నాయని తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా సూచించారు. 60ఏండ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోసు సైతం తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే చెప్పారు. త్వరలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలు నిధులు మంజూరు కానున్నాయని, ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
మండలంలో అవసరమైనచోట గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, త్వరలో ఇందుకు సంబంధించిన నిధులు సైతం మంజూరవుతాయని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ సురేందర్ మాట్లాడుతూ పరిగి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, ఆమెను సరెండర్ చేయాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.