“బీఆర్ఎస్ పార్టీనే నా బలం, ప్రజలే నా బలగం.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వికారాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం.. మరోసారి ఆశీర్వదించి.. మరింత ప్రగతి చేపట్టే అవకాశం కల్పించాలి..” అని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి ఆయనను బీఆర్ఎస్ వికారాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ నిర్వహించింది. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మాటల్లోనే..వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయుష్, క్రిటికల్ కేర్ దవాఖానలు, మెడికల్ కాలేజీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్ వంటివి ఎన్నో ఏర్పాటు చేసుకున్నాం. ఎన్కతలలో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేసుకోబోతున్నాం.. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అత్యధిక నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కేవలం మున్సిపాలిటీకే రూ.176 కోట్లు వెచ్చించాం.
ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం వరుసగా ఏడాదిపాటు స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగడం.. తదనంతరం కొవిడ్తో రెండేండ్లు కాలయాపన కావడంతో కేవలం ఏడాదిన్నరలోనే నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులను తీసుకొచ్చారు. ఆయుష్ దవాఖానతోపాటు క్రిటికల్ కేర్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, గిరిజన భవన్, సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ, మోమిన్పేట మండలంలోని ఎన్కతలలో భారీ పారిశ్రామిక కేంద్రమైన మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారు. ఇవేకాకుండా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణం, మున్సిపాలిటీ, సీడీపీ, ఎస్డీఎఫ్, డీఎంఎఫ్టీల ద్వారా రూ.200 కోట్లపైనే నిధులు.. ఇవే కాకుండా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వంతెనల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కింద నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులివ్వడం గమనార్హం. మరోవైపు గతంలో ఈ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఎంతోమంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినా అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారు. అయితే మొదటిసారి ఆనంద్ ఎమ్మెల్యేగా గెలిచి, నిత్యం ప్రజల్లో నే ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించి దండి నిధులను తీసుకొస్తున్నారు. నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.. -వికారాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
నమస్తే : లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.
ఎమ్మెల్యే : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రతిపక్షాలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేసి కుట్రలు చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు పథకం పూర్తికి ఎంతో కృషి చేస్తున్నారు. జిల్లాలోని 4 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు, 9 లక్షల ఆవాసాలకు తాగునీరు అం దించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఈ పథకం పూర్తైతే జిల్లాలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందనున్నది. రానున్న ఏడాదిలోనే నియోజకవర్గానికి సాగునీరందించేలా కృషి చేస్తా. త్వరలోనే కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటా.
నమస్తే : ఐదేండ్లలో మారిన రూపురేఖలు
ఎమ్మెల్యే : వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుస ఎన్నికలు, తదనంతరం కొవిడ్ వైరస్ ప్రభావంతో రెండేండ్లపాటు ఎలాంటి పనులు చేపట్టలేకపోయా. తదనంతరం గత ఏడాదిన్నర సమయంలోనే నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేశా. ప్రభు త్వం నుంచి దండిగా నిధులను తీసుకొచ్చి రూపురేఖలను మార్చా. సెగ్మెంట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రగతి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నా. ఇప్పటివరకు నా హయాంలో 1200 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమలకు సంబంధించిన మొబిలిటీ వ్యాలీని, అనంతగిరి ఆలయాభివృద్ధికి రూ.75 లక్షల నిధు లు, రూ. 15 కోట్లతో ఆయుష్ దవాఖానను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చా.
అదేవిధంగా రూ.28.30 కోట్లతో అనంతగిరిలో క్రిటికల్ కేర్ దవాఖాన నిర్మాణం, రూ.3 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.5 కోట్లతో వికారాబాద్ మున్సిపాలిటీలోని గంగారం, ఆలంపల్లి, రామయ్యగూడల్లో వైకుంఠధామాల నిర్మాణం, రూ.1.10 కోట్లతో గిరిజన భవన్, రూ.7 కోట్లతో ఇంటిగ్రెటేడ్ వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణాల పనులు రెండు ఎకరా ల్లో సాగుతున్నాయి. ఇవేకాకుండా వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.176 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్నో ఏండ్లుగా వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సర్కారు నుంచి రూ.96 కోట్లను తీసుకొచ్చా. గతంలో మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్కరూ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లా కేంద్రంలోని ప్రజల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించా. అయితే ప్రస్తుతం 35 ఫీట్లతో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు త్వరలో 70 ఫీట్ల మేర ఏర్పాటు కానున్నది.
నమస్తే :గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే..
ఎమ్మెల్యే : నాపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలకు పూర్తి న్యాయం చేసేందుకు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా. కొందరు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి, గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధిని విస్మరిస్తారు. నేను మాత్రం గెలిచిన నెల రోజుల్లోనే మీతో నేను కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి నేరుగా వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారానికి కృషి చేస్తున్నా. నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపాలిటీతోపాటు వికారాబాద్, ధారూరు, బంట్వారం, కోట్పల్లి, మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరిస్తున్నా. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నా. అన్ని గ్రామాల్లో పంచాయతీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, బ్రిడ్జిల నిర్మాణంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలు జాతీయ స్థాయి అవార్డులను కూడా దక్కించుకున్నాయి. నియోజకవర్గంలోని ఏ గ్రామానికెళ్లినా ప్రభుత్వం చేపట్టిన పనులపై అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. బీఆర్ఎస్ పార్టే బలం.. ప్రజలే తన బలగంగా ముందుకు సాగుతున్నా. గత ఐదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయడం ఖాయం.