పరిగి : జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లేఔట్లను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టీఎస్ బీపాస్ టాస్క్ఫోర్సు కమిటీ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అడుగగా నాలుగు మున్సిపాలిటీలలో టీఎస్ బీపాస్ కింద గృహ నిర్మాణాలకు 910 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి 548 నిర్మాణాలకు ఆమోదించడం జరిగిందని, 202 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. జిల్లా పరిధిలో 45 అక్రమ నిర్మాణాలు గుర్తించినట్లు కమిటీ సభ్యులు వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ గృహ నిర్మాణాల అనుమతులకు, అక్రమ లేఔట్లు, అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టాస్క్ఫోర్సు సమావేశం ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించాలని సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, నీటి పారుదల, ఆర్అండ్బీ శాఖల అధికారులు, జిల్లా ఫైర్ ఆఫీసర్, పరిశ్రమల శాఖ ఏడీ పాల్గొన్నారు.