హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. మారుతున్న జీవన శైలి, పర్యావరణంలో మార్పులు, చికిత్సలో ఆలస్యం కారణంగా రోగుల సంఖ్య పెరుగుతున్నదని, ఇది ప్రజారోగ్య సంక్షోభానికి దారితీయవచ్చని హెచ్చరించింది. ఇది ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి దేశంలో ఏటా 28 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు ‘గ్లోబోకాన్, డబ్ల్యూహెచ్వో గ్లోబల్ స్టేటస్ రిపోర్టు-2026’ను విడుదల చేసింది. నాలుగేండ్ల క్రితం 2022లో దేశంలో 14.1లక్షల కొత్త కేసులు నమోదు కాగా, 9.16 లక్షల మరణాలు సంభవించాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, పురుషుల్లో పొగాకు కారణంగా ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య 2024 నాటికి 16.1లక్షలకు చేరినట్టు ఆ అధ్యయనం తెలిపింది.
క్యాన్సర్కు కారణాలు
ఎక్కువ సమయం కూర్చోవడం, వ్యాయా మం చేయకపోవడంతో ఊబకాయం, తగ్గిన శారీరక శ్రమ కారణంగా రొమ్ము, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్ క్యానర్లు వస్తున్నాయి. ధూ మపానంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, గుట్కా, కైనీ, తంబాకుతో నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువగా మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, రిఫైనరీ షుగర్స్, పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తక్కువగా తినడం క్యాన్సర్కు కారణమవుతున్నది. ఎక్కువగా పురుగుమందులు వినియోగించిన ఆహార పదార్థాలు తినడం కూడా క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణం అని ఆ అధ్యయనం వెల్లడించింది. అధికంగా మద్యం సేవించడంతో కాలేయం, నోరు, అన్నవాహిక క్యాన్సర్కు కారణమవుతున్నది. మద్యంతోపాటు పొగాకు అలవాటు ఉన్న వారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఎక్కువ కాలం వాయు కాలుష్యానికి గురికావడం సైతం క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణంగా పేర్కొంది. దేశంలో క్యాన్సర్ పరీక్షలు ఆలస్యంగా చేయించుకోవడం, వ్యాధి ముదిరిన తరువాత చికిత్సపై శ్రద్ధ వహించడం ప్రధాన సమస్యగా మారినట్టు డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తంచేసింది.
నివారణ ఇలా.!
జీవనశైలిలో మార్పుల ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని డబ్ల్యూహెచ్వో సూచించిం ది. వారానికి కనీసం 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలని తెలిపింది. ధూమపానం, గుట్కా, తంబాకు వీడితేనే రిస్క్ తగ్గుతుందని హితవు పలికింది. మద్యం మోతాదు తగ్గించడం లేదా మొత్తానికి దూరం గా ఉండాలని హెచ్చరించింది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలని సూచించింది. హెచ్పీవీ, హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపింది. వయసుకు తగిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపింది.