పరిగి, ఏప్రిల్ 26 : ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ క్రమేణా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారింది. ఉద్యమ సమయం నుంచి ఒక మహత్తర ఎత్తుగడతో పార్టీలను ప్రత్యేక్షంగా ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తులు ఫలించాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్పై ప్రజల్లో వచ్చిన ఆదరణ ఓటు బ్యాంకుగా మారిందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది. జిల్లాలోని వికారాబాద్, పరిగి రెండు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కేటాయించగా, వికారాబాద్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. పరిగిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీ చేసినా టీఆర్ఎస్కు గణనీయమైన ఓట్లు రావడం గమనార్హం. ఆనాటి ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ సైతం రాజకీయ పార్టీగా బలపడింది.
నాటి నుంచి అనేక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకొని తన సత్తా చాటింది. నూతనంగా ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లా పరిషత్ను సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతోపాటు జిల్లా పరిధిలో మెజార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వారే కొనసాగుతున్నారు. జిల్లాలో రెండు జాతీయ పార్టీలకు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఓవైపు పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు గెలుపొందగా, పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ సర్పంచ్, పీఏసీఎస్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులే విజయఢంకా మోగించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పరిధిలోని తాండూరు ఎమ్మెల్యేగా పట్నం మహేందర్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యేగా సంజీవరావు టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. నాలుగేండ్ల తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించారు. తాండూరు నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. మరోవైపు రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. దీంతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయ ప్రస్థానం కొనసాగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పట్నం మహేందర్రెడ్డి విజయం సాధించారు.