వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దోమ మండలం బొంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. అక్కడక్కడ ధాన్యం తడిసి ముద్దైంది. మరికొంత మంది రైతులు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు కప్పారు. బొంరాస్ పేటలో కురిసిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5.8 మీమీ వర్షపాతం నమోదైంది. ధారూర్లో 36.0 మీమీ, బంట్వారంలో 23.5, నాగారం (తొర్రూమామిడి)లో 24.3, బొంరాస్పేటలో 17.5 మీమీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, ధారూర్, పెద్దేముల్, బంట్వారం, మర్పల్లి, దోమ, బొంరాస్ పేట, యాలాల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
బొంరాస్పేటలో..
బొంరాస్పేట, మే 5: మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అరగంటకు పైగా కురిసింది. ఈదురు గాలులకు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు నేల రాలాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని తడవకుండా రైతులు వాటిపై ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచారు. బొంరాస్పేట కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం బస్తాలు తడువకుండా టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచారు. బస్తాల కిందకు వర్షపు నీరు చేరకుండా జాగ్రతలు తీసుకున్నారు.
పూడూరులో..
పూడూరు, మే5: మండలంలోని మన్నెగూడ, మీర్జాపూర్, ఎన్కెపల్లి, గొంగుపల్లి, చీలాపురం, రాకంచర్ల గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో 20 నిమిషాల పాటు వర్షం కురిసింది.