వికారాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో నిలువాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తే గ్రామాలు అభివృద్ధి మార్గంలో పయనిస్తాయని మంత్రి తెలిపారు. గురువారం వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యఅతిథిగా మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొనగా, జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కలెక్టర్ పౌసుమిబసు, జడ్పీ సీఈవో జానకిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ పులుమద్ది గ్రామంలో పల్లె ప్రకృతి వనం చాలా బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారని వెల్లడించారు. చెత్త ద్వారా ఎరువును తయారు చేసిన గ్రామ సర్పంచ్, అధికారులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కోసం అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల బలోపేతం కోసం ఒక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వికారాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, అధికారులు కష్టపడి పని చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. జిల్లాలోనే పల్లె ప్రగతిలో పులుమద్ధి గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు.
రూ.59 లక్షలు మంజూరు..
పులుమద్ధి గ్రామానికి రూ.59 లక్షలు పల్లె ప్రగతి కింద మంజూరైనట్లు చెప్పారు. హైదరాబాద్లో తాగే నీరు.. గ్రామాల ప్రజలు తాగుతున్నారన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అన్న చోట, నేడు 24 గంటల విద్యుత్ ఇస్తుందని కొనియాడారు. ఎకరాకు పెట్టుబడి సాయం రూ.10వేలు ఇస్తూ ప్రతి ఏటా రూ.15వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమవుతున్నాయని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లతో పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించటానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి పరుస్తూ, పాఠశాలలో లైబ్రరీని నిర్మించేలా మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
స్వచ్ఛత కోసం పాటు పడుతాం..
చెత్తను బయట వేయబోమని, స్వచ్ఛత కోసం పాటు పడుతామని, చెట్లను కాపాడుతామని గ్రామస్తులతో మంత్రి ఈ సందర్భంగా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం పల్లె, పట్టణ ప్రగతితో పాటు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ 10రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కష్టపడి పని చేస్తే గ్రామాలు శుభ్రంగా తయారు అవుతాయని మంత్రి అన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలను ఉదయం పర్యవేక్షించాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు పల్లె ప్రకృతిలో భాగంగా సమకూర్చడంతో చాలా వరకు సమస్యలు తీరాయన్నారు. హరితహారం ద్వారా గ్రామంలో విరివిగా మొక్కలు నాటారని, నర్సరీ బాగుందని, స్థానిక అవసరాలకు దీని ద్వారా మొక్కలు సమకూర్చుకోవాలన్నారు. ఈ సారి ప్రతి ఇంటి వద్ద్ద నాటేలా ఆరు మొక్కలను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో నీరు నిలిచే ప్రదేశాలు లేకుండా చూడాలని, డ్రై డేను నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాన్ని వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తూ డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు.
దళితుల్లో పేదరిక నిర్మూలన కోసం వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి దళిత్ ఎంపవర్మెంట్ స్కీంకు రూపకల్పన చేశారన్నారు. 100 మంది చొప్పున రూ.10లక్షలు రైతు బంధు తరహాలో వారి అకౌంట్లో జమచేసేలా కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ త్వరలో జారీ అవుతాయన్నారు. నిరుద్యోగులు, పేద దళితులు పేదరికం నుంచి బయటపడేలా సాయం అందుతుందన్నారు. అనంతరం స్వయం సహాయక గ్రూపు సభ్యులకు రూ.3.40లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డీపీవో రిజ్వాన, పీడీ కృష్ణన్, డీఈవో రేణుకాదేవి, ట్రాన్సో ఎస్ఈ రమణమూర్తి, ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదినీ పాల్గొన్నారు.