షాబాద్, జనవరి 30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే రంగారెడ్డి జిల్లాలో చురుగ్గా సాగుతున్నది. ఆదివారం 678 బృందాల సభ్యు లు ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో పర్య టించి ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. జిల్లాలో 45,304 కుటుంబాల్లో సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపా రు. జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లను అందించారు. కొవిడ్పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 15-18 ఏండ్ల లోపు వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 4,90,541 కుటుంబాల్లో సర్వే నిర్వహించారు.
కొవిడ్ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే పూర్తయింది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈనెల 21వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. మొత్తం 2,20,386 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు 754 ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 92 బృందాలు, గ్రామాల్లో 662 బృం దాలతో సర్వే నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్, వీఆర్ఏ, గ్రామపంచాయతీ కార్యదర్శి… మున్సిపాలిటీల్లో ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ టీచర్, మెప్మా రిసోర్స్పర్సన్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. జిల్లాలో పది రోజులపాటు సర్వే కొనసాగగా, 2,33,201 కుటుంబాల్లో పూర్తి చేశారు. ఇంటింటికీ తిరిగి జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఉంటే వారికి వైద్యుల సూచన మేరకు మందులను అందజేశారు. అలాగే అర్హులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించడంతోపాటు ఇంటి వద్దే వారికి టీకాలను కూడా వేశారు.