వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైనే నిధులు విడుదల చేయడం గమనార్హం. గతంలో జిల్లా, మండల కేంద్రాల్లోనే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే మట్టి రోడ్లతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రం నుంచి అన్ని గ్రామపంచాయతీలకు రోడ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి రోడ్లను వేయడంతోపాటు ఆయా గ్రామపంచాయతీల్లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం, అండర్డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.
జిల్లాలో ప్రస్తుతం రోడ్డులేని గ్రామమంటూ లేకుండా పెద్దఎత్తున నిధులిచ్చి రోడ్లను అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. రోడ్ల నిర్మాణంతోపాటు ప్రతి ఏటా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులను చేపడుతున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతోపాటు కొత్త రోడ్ల ఏర్పాటుకు జిల్లా పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతోపాటు బీటీ రోడ్ల మరమ్మతులు, మోరీల మరమ్మతులు, కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
రూ.192 కోట్ల నిధులు మంజూరు
జిల్లాలోని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జిల్లాలోని ఆర్అండబీ రోడ్ల మరమ్మతులతోపాటు బీటీ రోడ్లు, కొత్త బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.192 కోట్లు నిధులను మంజూరు చేసింది. జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనలకు సంబంధించి ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు సంబంధించి.. జిల్లావ్యాప్తంగా 160 కిలోమీటర్ల మేర రోడ్లు అధిక వర్షాలతో దెబ్బతిన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు నిర్ణయించారు. జిల్లా పరిధిలోకి వచ్చే వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిపి 160 కి.మీ మేర ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.93 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా అంతటా దెబ్బతిన్న మోరీల మరమ్మతులను కూడా చేపట్టనున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 7 కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాండూరు నియోజకవర్గంలో 1, పరిగి నియోజకవర్గంలో 2, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్లో 1, వికారాబాద్ నియోజకవర్గంలో 3 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.33 కోట్ల నిధులను మంజూరు చేసింది.
పీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.66.01 కోట్లు
జిల్లాలోని పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 200 కి.మీ మేర బీటీ రోడ్ల మరమ్మతులు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.66.01 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా వరదలతో దెబ్బతిన్న 86.86 కి.మీ రోడ్ల మరమ్మతులకు రూ.17.69 కోట్లు నిధులు మంజూరుకాగా.. కొడంగల్ నియోజకవర్గంలో 12.10 కి.మీ.లకు రూ.1.40 కోట్లు, వికారాబాద్లో 29 కి.మీ.లకు రూ.8.41 కోట్లు, పరిగిలో 45.76 కి.మీ.లకు రూ.7.88 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 113.81 కి.మీ బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.48.32 కోట్ల నిధులు రాగా. వికారాబాద్ నియోజకవర్గంలో 24.39 కి.మీ.లకు రూ.11.10 కోట్లు, తాండూరులో 33.57 కి.మీ.లకు రూ.15.19 కోట్లు, పరిగిలో 36.55 కి.మీ.లకు రూ.12.74 కోట్లు, కొడంగల్లో 10.70 కి.మీ.లకు రూ.5 కోట్లు, చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల పరిధిలో 8.60 కి.మీ.లకు రూ.4.29 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మార్చిలోగా పనులు పూర్తి చేస్తాం: ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్
జిల్లాలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు కొత్తగా 7 బ్రిడ్జిల నిర్మాణానికి కూడా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు విడుదలైన రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, మార్చి నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.