వికారాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఆడబిడ్డల పెండ్లిళ్లు భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన యువతుల పెండ్లిళ్లకు రూ.లక్షా116లను అందిస్తున్నది. తొలుత రూ.51వేలు, అనంతరం రూ.75,116లకు పెంచింది. అన్నింటి ధరలు పెరిగిన దృష్ట్యా ప్రస్తుతం సాయాన్ని రూ.లక్షా116లకు పెంచి అందజేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం అందజేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రతి ఏటా బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నది. తొలుత లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా.. తరువాత నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పేద కుటుంబాల కుటుంబ భారాన్ని ప్రభుత్వం మోస్తున్నదని లబ్ధిదారుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పురోగతి ఇలా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అక్టోబర్ 2, 2014న రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. తొలుత ఆర్థిక సాయాన్ని రూ.51వేలను అందించిన ప్రభుత్వం.. 2017-18లో రూ.75,116., 2018 మార్చి నుంచి రూ.లక్షా116లకు పెంచుతూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అర్హులని నిర్ణయించినప్పటికీ 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి నుంచి బీసీ, ఈబీసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆర్డీవోలు నిర్వహిస్తున్నారు. ఈ పథకాల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం తహసీల్దార్లకు, క్షేత్రస్థాయిలో సంబంధిత రెవెన్యూ సిబ్బంది దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేస్తున్నారు. తదనంతరం ఆర్డీవోలు దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు దరఖాస్తుల జాబితా చేరుతుంది. శాసనసభ్యులు సంబంధిత జాబితాకు ఆమోదం తెలిపిన అనంతరం ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను నేరుగా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. వీలైనంత త్వరితగతిన పరిశీలించి ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పేదింటి ఆడపడచులకు మేనమామ సీఎం కేసీఆర్: ప్రకాశం, మంబాపూర్, పెద్దేముల్ మండలం
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేసి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని పేదింటి ఆడపడుచుల పెండ్లిళ్లకు అందించి మేనమామగా మారారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రతి పేదింటి ఆడపడుచుల కుటుంబాలు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయి.
గతంలో ఎవరూ ఇలాంటి పథకాలు అమలు చేయలేదు – కీరాసింగ్, ఎర్రగడ్డతండా, పెద్దేముల్ మండలం
గత ప్రభుత్వాల హయాంలో ఏనాడూ పేదింటి ఆడపడుచుల కుటుంబాలకు ఇలాంటి బృహత్తర పథకాలు అమలు చేయలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల పెండ్లిళ్ల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాల పాలిట దేవుడిలా మారిపోయారు.
కల్యాణలక్ష్మి ఆదుకుంది: కోట్ల ఆండాళు, ఏర్పుమళ్ల, బొంరాస్పేట మండలం
కల్యాణలక్ష్మి పథకం తమను ఎంతగానో ఆదుకుంది. ఇద్దరి బిడ్డల పెండ్లిళ్లు చేసిన తరువాత ఏడాదిలోపే ఆర్థిక సాయం అందింది. పెండ్లిళ్ల కోసం చేసిన అప్పులు ఆర్థిక సాయం అందిన తరువాత తీర్చాం. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. ఇది మరపురాని సాయం.
షాదీముబారక్ మంచి పథకం: షెహనాజ్బేగం, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
షాదీముబారక్ చాలా మంచి పథకం. సీఎం కేసీఆర్ ఈ పథకంతో ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సాయం చేయలేదు. కేసీఆర్ సార్ ఆడబిడ్డలకు మేలు చేస్తున్నారు.
కులమతాలకతీతంగా సాయం : ఖాదర్బాబా, ఎన్కతల
కులమతాలకతీతంగా నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయమందించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు పెద్దన్నగా నిలుస్తున్నారు. ఈ పథకంతో బాల్య వివాహాలు తగ్గుతున్నాయి. షాదీ ముబారక్ పథకంతో నాకు ఎంతో మేలు జరిగింది.
ఎనిమిదేండ్లలో 27,895 మందికి ఆర్థిక సాయం
ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో గత ఎనిమిదేండ్లలో ఇప్పటివరకు 27,895 మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల ఆర్థిక సాయాన్ని పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అందజేసింది. కల్యాణలక్ష్మి కింద 2016-17లో 1677 మంది దరఖాస్తు చేసుకోగా 1360 దరఖాస్తుదారులకు రూ.51 వేల చొప్పున రూ.6.93 కోట్ల సాయాన్ని, షాదీముబారక్ కింద 519 మంది దరఖాస్తు చేసుకోగా 464 మంది దరఖాస్తుదారులకు రూ.2.36 కోట్ల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది.
2017-18లో కల్యాణలక్ష్మిలో భాగంగా 3332 దరఖాస్తులురాగా 3236 మంది దరఖాస్తుదారులకు రూ.16.50 కోట్లు, షాదీముబారక్ కింద 741 దరఖాస్తులురాగా 724 దరఖాస్తుదారులకు రూ.3.64 కోట్ల సాయాన్ని రూ.51 వేల చొప్పున అందజేసింది.
2018-19లో కల్యాణలక్ష్మి కింద 3814 దరఖాస్తులురాగా 3750 దరఖాస్తుదారులకు రూ.లక్షా116 చొప్పున రూ.37.54 కోట్లు, షాదీముబారక్ కింద 847 దరఖాస్తులురాగా 841 దరఖాస్తుదారులకు రూ.8.41 కోట్ల సాయాన్ని అందజేశారు.
2019-20లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 4583 దరఖాస్తులకు రూ.45.88 కోట్లు, 2020-21లో 5506 దరఖాస్తులకు రూ.55.12 కోట్లు, 2021-22లో 5419 దరఖాస్తులకు రూ.54.25 కోట్లు, 2022-23లో ఇప్పటివరకు 1483 దరఖాస్తులకు రూ.14.84 కోట్లను అందజేసింది.