పరిగి, నవంబర్ 10 : వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో నాలుగు వినూత్న విధానాల్లో పంటల సాగుతో తక్కువ పెట్టుబడి ఖర్చు ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో యాసంగిలో 1,47,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వానకాలంలో వరిని వెదజల్లే పద్ధతి, అలాగే ఇతర మూడు విధానాల అమలుతో పంటలకు సంబంధించిన పెట్టుబడి ఖర్చును తగ్గించడంతోపాటు మంచి దిగుబడి సాధించే దిశగా అడుగులు వేసిన వ్యవసాయ అధికారులు అందుకు తగ్గట్లు పంటలు సాగు చేయించారు.
ఈ యాసంగిలో సైతం నాలుగు వినూత్న పద్ధతులు అమలు చేయడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించి దిగుబడులు పెంచాలన్నది ఆలోచన. ఇందుకు సంబంధించి జిల్లాలోని 99 క్లస్టర్లలో ఒక్కో విధానంలో 50 ఎకరాల్లో ఈ విధానం అమలుకు నిర్ణయించారు. తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతోపాటు నాణ్యమైన పంటలు చేతికి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానాల అమలుకు సంబంధించి ఆయా క్లస్టర్లవారీగా సమాచార సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ విధానం అమలుకు నిర్ణయించగా అందులో వికారాబాద్ జిల్లాను ఎంపిక చేశారు.
క్లస్టర్లోని ఒక్కో విధానానికి 50 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రం
జిల్లా పరిధిలో ఈసారి యాసంగిలో నాలుగు విధానాల అమలుకు వ్యవసాయాధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 99 క్లస్టర్ల పరిధిలో ఒక్కో విధానంలో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కన ఒక క్లస్టర్లో నాలుగు విధానాలు కలిపి సుమారు 200 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని 99 క్లస్టర్లలో 19,800 ఎకరాల్లో నాలుగు విధానాల్లో ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ విధానాల్లో భాగంగా రైతులు సాగు చేసిన పంటలకు ఏ దశలో ఎంత మోతాదులో ఎరువు అవసరమో తెలియజేసి సంబంధిత రైతు ద్వారానే వేయిస్తారు. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రైతులను ఎంపిక చేసిన అధికారులు పూర్తిస్థాయిలో ఏఈవోల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు. వీటిలో కొన్నింటిని మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయాధికారి సైతం పర్యవేక్షిస్తారు. ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడంతో పక్కనే సాధారణ విధానంలో సాగు చేసిన పంటకు, వినూత్న విధానంలో సాగు చేస్తున్న పంటల దిగుబడి, నాణ్యత తదితర అంశాల్లో స్పష్టమైన తేడాను రైతులకు తెలియజేస్తారు.
వినూత్న విధానాలతో చక్కటి దిగుబడులు: గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్
ఈసారి యాసంగి సీజన్లో నాలుగు వినూత్న విధానాల అమలు ద్వారా పంటలు సాగు చేసే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. జిల్లా పరిధిలో 99 క్లస్టర్లు ఉండగా ఒక్కో క్లస్టర్లో ఒక విధానంలో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 4,950 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలు నెలకొల్పనున్నాం. వినూత్న విధానాల అమలుతో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు నాణ్యమైన పంట దిగుబడి సాధించవచ్చు.
నాలుగు విధానాల అమలుకు నిర్ణయం
మొదటి పద్ధతిలో వేరుశనగలో జిప్సమ్ను వాడడం ద్వారా చక్కటి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జిప్సమ్లోని కాల్షియం, సల్ఫర్లోని కాల్షియం వేరుశనగలో కాయలు ఊరడం, తాలు పోకుండా, కాయ నిండుగా రావడానికి దోహదపడుతుంది. సల్ఫర్ నూనె శాతాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. వేరుశనగకు ఎకరానికి 200 కిలోలు జిప్సమ్ వేస్తే పంట అధిక దిగుబడి, నాణ్యమైన పంట వస్తుంది.
రెండో విధానంలో ఫాస్ఫరస్ సొల్యుబ్యులైజింగ్ బ్యాక్టీరియా విధానంతో భూమిలోని భాస్వరం మొక్కకు అందేలా చూడడం ప్రధాన ఉద్దేశం. జిల్లాలోని భూముల్లో భాస్వరం నిల్వలున్నా మొక్కకు అందుబాటులో ఉండవు. భూమిలో గడ్డకట్టి పోయి, మొక్కకు లభించకుండా ఉంటుంది. ఫాస్ఫరస్ సొల్యుబులైజింగ్ బ్యాక్టీరియా గడ్డ కట్టిన స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలా చూస్తుంది. కృత్రిమంగా తయారుచేసిన ఈ బ్యాక్టీరియా పొడి రూపంలో లభిస్తుంది. దీంతో విత్తనశుద్ధి చేసి నాటితో భూమిలోని భాస్వరాన్ని కరిగింపజేసి మొక్కకు అందజేస్తుంది. ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల పీఎస్బీతో విత్తనశుద్ధి చేసి వాడాల్సి ఉంటుంది. దీంతో ఒక ఎకరాకు బస్తా డీఏపీ ఆదా అవడం ద్వారా ఖర్చు తగ్గడంతోపాటు మంచి దిగుబడి వస్తుంది.
మూడో పద్ధతిలో శనగ పంటలో ఎండుతెగులు సమస్యను నివారించేందుకు ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రియాన్ని వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి శిలీంద్రియంతో విత్తన శుద్ధి చేసి భూమిలో నాటినట్లయితే శిలీంద్రయం తయారు చేసే రసాయనాలు ఎండుతెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. దీంతో శనగ పంటకు ఎండుతెగులు సమస్య రాకుండా అరికడుతుంది.
నాలుగో విధానంలో పంటలకు అవసరమైన సమయాల్లో ఎరువులు వాడడం ద్వారా పంట దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాధికారులు సూచిస్తున్నారు. వరి పంటలో మూడు దఫాలో ఎరువులు వేయాలని పేర్కొన్నారు. పిలకలు పెట్టే దశ, పొట్టకు వచ్చే సమయానికి, పాలు పోసుకునే దశలో నత్రజనిని సమపాళ్లలో వాడితే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఇతర పంటలలోనూ ఒకేసారి కాకుండా వివిధ దశల్లో ఎరువులు వాడాలి. దీంతో నత్రజని వృథా కాకుండా సమయానుకూలంగా మొక్కకు అందుతుంది.