వికారాబాద్, అక్టోబర్ 31, (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని, పదోన్నతులు, పైరవీల కోసం సిగ్గు లేకుండా టీఆర్ఎస్కు మద్దతిస్తున్నారని, కేసులు పెట్టాలని బండి సంజయ్ ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అంతటా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యోగుల సత్తా ఏందో చూపిస్తామని జిల్లా టీఎన్జీవో నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లో టీఎన్జీవోలు ముందుండి నడిపించారని, అలాంటిది టీఎన్జీవోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో టీఎన్జీవో నేత శివకుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడంతోపాటు బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంజాద్పషా, రవీందర్, విజయలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీలత, యాదగిరి, రవీందర్, రమేశ్, నర్సింలు, హేమలత, బంధవి, శివకుమారి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో…
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 : తెలంగాణ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సోమవారం జిల్లా ఉద్యోగులు భగ్గుమన్నారు. బండి వ్యాఖ్యలకు నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. రంగారెడ్డిజిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో చేపట్టిన నిరసనకు కలెక్టరేట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బండి సంజయ్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి అని నినాదాలు చేశారు. తెలంగాణ సాధించడంలో ఉద్యోగ సంఘాల పాత్ర ఎంతో కీలకమని బండిసంజయ్ గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ ఉద్యోగులంతా అంకితభావంతో పని చేయడం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్నారు. బండి సంజయ్ ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో తమ కుటుంబాలను వదిలిపెట్టి సకల జనుల సమ్మె చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు బుచ్చిరెడ్డి, విజయకుమార్, చంద్రశేఖర్, కలెక్టరేట్ ఉద్యోగుల అధ్యక్షుడు తారకేశ్వర్ పాల్గొన్నారు.
ఉద్యోగులను బదునాం చేయకండి..
రాజకీయాల పేరుతో సమాజం కోసం నిత్యం తపనపడే ఉద్యోగులపై రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఎక్కడ ఏమి జరిగినా ఉద్యోగులపై నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను హేళన చేస్తూ మాట్లాడడం బాధాకరం. దేశం, ధర్మం అని చెప్పేవాళ్లే ఇలా మాట్లాడడం ఏమిటి..? బేషరతుగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి.
– జైపాల్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు, తాండూరు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే న్యాయం జరిగింది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడాలేని విధంగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉన్నది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఉద్యోగులపై రాజకీయ రంగు పులమటం బండి సంజయ్కు తగదు. తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– బుచ్చిరెడ్డి, టీఎన్జీవోస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఉద్యోగులు ఏ ఒక్కరి కోసం పని చేసే వారు కాదు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసం ఉద్యోగులు పని చేస్తున్నారు. అలాంటి వారిపై బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఎంతగానో బాధించింది.
– విజయ్కుమార్,
ఉద్యోగ సంఘాల నాయకుడు, రంగారెడ్డి జిల్లా
బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే..
టీఎన్జీవో నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. టీఎన్జీవో నేతలు పదోన్నతులు, పైరవీల కోసమే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారనడం సరికాదు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పనట్లయితే బీజేపీ నేతలకు టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల బలమేందో, ఐక్యత ఏందో చూపిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జీవోలను అవమానించేలా మాట్లాడటం సరికాదు.
– శివకుమార్, టీఎన్జీవో వికారాబాద్ జిల్లా నాయకుడు
ఉద్యోగులను కించపర్చారు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉద్యోగులను కించపర్చారు. అధికార పార్టీకి అమ్ముడు పోయారంటూ అవహేళనగా మాట్లాడటం సక్రమమైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి భావాలు వారికి ఉంటాయి. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలకు ఉద్యోగులు మద్దతు ఇవ్వడం తప్పు కాదు కదా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నది. ప్రజాశ్రేయస్సు కోసం పని చేసే ప్రభుత్వానికి కచ్చితంగా మద్దతిస్తాం.
– రాంచందర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కులకచర్ల
‘బండి’వి తప్పుడు ఆరోపణలు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నీవేమైనా ఉద్యమంలో పాల్గొన్నావా.. ఉద్యమంలో ఉద్యోగులది కీలకపాత్ర. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటుంది. దీనిపై అనుచితంగా మాట్లాడిన బండి సంజయ్ ఉద్యోగులకు రెండుచేతులు జోడించి క్షమాపణ చెప్పాలి.
– తుప్పలి అశోక్కుమార్, ఉపాధ్యాయుడు, కులకచర్ల
ఉద్యోగులపై విమర్శలు తగవు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషించడం బాధాకరం. రాజకీయ నేతలు రాజకీయం చేయక ఉద్యోగులపై విరుచుకుపడడం ఏమిటీ..? ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
– ఎన్.బాల్రాజ్, ప్రభుత్వ ఉద్యోగి, యాలాల