పరిగి, అక్టోబర్ 29 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 13 వార్డుల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమన్నది ప్రతిపక్షాలకు తెలుసని.. ఏ ఇంటికి వెళ్లినా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్(బీఆర్ఎస్)తోనే సాధ్యమన్నది వాస్తవమన్నారు. కూసుకుంట్ల విజయం ఖాయమన్నారు. తమ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నది మునుగోడు ప్రజల అభిమతమని.. టీఆర్ఎస్(బీఆర్ఎస్) వల్లే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఏ పార్టీ.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్(బీఆర్ఎస్) కృషి
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెర్మెట గ్రామంలోని 7, 8 వార్డుల్లో పర్యటించి ఎస్సీ కమ్యూనిటీ వారితో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి గతంలో ఏ నాయకుడూ ఆలోచించలేదని.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ అద్భుత పథకాలను అందించి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. చేతివృత్తులకు పూర్వ వైభవం కల్పించేలా సంక్షేమ ఫలాలను అందించారన్నారు. ప్రస్తుతం దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు పథకాన్ని అందుకున్న లబ్ధిదారులు నేడు ఎంతో ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వానికి పూర్తి మద్దతును తెలిపి మనందరి జీవితాల్లో వెలుగులు నింపుకుందామని కోరారు. ఈవీఎం ద్వారా ఏవిధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలో ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు శివకుమార్, మునుగోడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలున్నారు.
కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి
బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అన్ని గ్రామాలు, మండలాలు అభివృద్ధి జరిగాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. మునుగోడు అభివృద్థికి ప్రభుత్వం తప్పక కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులున్నారు.