వికారాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. వికారాబాద్ జిల్లాకు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ వైద్య కాలేజీని వచ్చే ఏడాది ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖ, జిల్లా ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కాలేజీ సమీపంలోని బిలా దాఖలా స్థలాల వివరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేశారు. అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలాన్నే దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామి ఆలయ పార్కింగ్ ముందు భాగంలోనే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయి. సంబంధిత భూములు కూడా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన భూములు కావడంతో సంబంధిత స్థలాన్ని ఫైనల్ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఒకవేళ అనంతగిరిలో వైద్యారోగ్య శాఖ స్థలంలో వద్దనుకుంటే బిల్లా దాఖలా భూముల్లో మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. మెడికల్ కాలేజీ స్థలాల తుది నిర్ణయం వీలైనంత త్వరగా అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులను వెల్లడించనుంది. 100 సీట్లతో జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.
జిల్లా ప్రజలకు సత్వర, నాణ్యమైన వైద్యసేవలు
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసిన దృష్ట్యా ప్రస్తుతమున్న వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని 380 పడకల బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. వైద్య కళాశాల ఏర్పాటుతో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 12 వైద్య సేవలు కొనసాగుతుండగా.. బోధనాసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయితే 20కిపైగా వైద్య సేవలు, ఐసీయూ, ట్రామా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. 380 పడకల బోధనాసుపత్రితోపాటు మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే స్టాఫ్, బోధనా సిబ్బంది పోస్టులు మంజూరుకానున్నాయి. రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, అప్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, బ్లడ్బ్యాంక్ అధికారి సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వపరంగా అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా వైద్య విద్య మెరుగుపడటంతోపాటు గ్రామీణ వైద్యానికి మహర్దశ పట్టనుంది.
బోధనాసుపత్రిగా ఏరియా ఆసుపత్రి అప్గ్రేడ్
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 380 పడకల అనుబంధ ఆసుపత్రిని ముందుగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. వికారాబాద్లో 100 పడకల ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 380 పడకలతో బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోపాటు ఏరియా ఆసుపత్రిపై మరో రెండస్తుల నిర్మాణాన్ని చేపట్టేందుకు రూ.30 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. బోధనాసుపత్రి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో వీలైనంత త్వరలో పనులు ప్రారంభించేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
స్థలాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాం: కలెక్టర్ నిఖిల
జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కాలేజీ సమీపంలోని బిల్లా దాఖలా స్థలాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. స్థలాల ఎంపికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.