చేవెళ్ల రూరల్, అక్టోబర్ 11 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని. వ్యవసాయ శాఖ అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఇబ్రంహీంపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ కింద పూర్తిగా ఉచితంగా అందజేస్తున్న కుసుమ విత్తనాలను ఏడీఏ రమాదేవి, ఏవో తులసితో కలిసి ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి, వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నదని తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం ఏడీఏ రమాదేవి మాట్లాడుతూ.. యాసంగి (అక్టోబర్ రెండో వారం నుంచి నవంబర్ మొదటి వారం)లో కుసుమ ఐఎస్ఎఫ్-764 అనే కొత్త రకం విత్తనాలు సబ్సిడీ కింద పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
ఒక రైతుకు అర ఎకరానికి 2 కిలోల చొప్పున అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కుసుమ విత్తనాలు చేవెళ్ల డివిజన్కు 46 క్వింటాళ్లు (4600 కేజీలు) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంట కాలం 125 నుంచి 130 రోజుల్లో ఎకరానికి 6.5 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి ఉంటుందని, ఇవి మేలు రకం విత్తనాలు కాబట్టే రైతులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాలతి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, ఇబ్రహీంపల్లి సర్పంచ్ మంజుల, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బర్కల రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు పాల్గొన్నారు.