చేవెళ్ల టౌన్, అక్టోబర్ 8: ప్రభుత్వ దవాఖానలో కల్పిస్తున్న వసతులు, అందజేస్తున్న సౌకర్యాలతో ప్రజల్లో రోజు రోజూకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరుగుతున్నది. నెలకు 30 వరకు కాన్పులు అవుతున్నాయి గతంలో సర్కార్ దవాఖానను చిన్నచూపు చూసేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రభుత్వ దవాఖానకే వెళ్లాలి అనే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ దవాఖాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేయడంతో పాటు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటుంది. అన్ని రకాల మందులు, 24 గంటలు వైద్యం అందించే విధంగా వైద్య సిబ్బంది, సత్వర వైద్యసేవల కోసం అంబులెన్స్, అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా గర్భిణులు, బాలింతలకు చేవెళ్ల దవాఖాన పుట్టింటిని మరిపించేలా భరోసా ఇస్తున్నది. తల్లీబిడ్డల క్షేమం కోసం ఇంటి ప్రసవాలను అరికట్టి దవాఖానల్లోనే వందకు వంద శాతం కాన్పులయ్యేలా చూడాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నది.
200లకు పైగా ఓపీ సేవలు
ప్రతి నెలా 200లకు పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. రోజుకు 8 నుంచి 10 మంది రోగులు చేవెళ్ల ఏరియా ఆస్పత్రిలో ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు. ఒక వైపు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు చేస్తూనే దవాఖానకు వచ్చే వారికి ఇతర సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రైవేట్ దవాఖానల కంటే ప్రభుత్వ దవాఖానల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
మరిన్ని వైద్య సేవలందిస్తాం
చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో కాన్పులతో పాటు ఓపీ సేవల సంఖ్య పెరుగుతున్నది. సర్కార్ దవాఖానల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, అధికారుల సహకారంతో దవాఖానలో మరిని వైద్య సేవలు అందిస్తాం.
– డాక్టర్. లక్ష్మీకాంత్ రెడ్డి, వైద్యులు