వికారాబాద్, సెప్టెంబర్ 15 : దశాబ్దాలు గడుస్తున్నా.. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది సంఘం లక్ష్మీబాయి పాఠశాల. అందులో చదివిన విద్యార్థినులు జిల్లా అధికారులు, డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, పోలీసులుగా మారి ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. 1979లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని 10 ఎకరాల్లో బాలిక విద్య కోసం సంఘం లక్ష్మీబాయి పాఠశాలను ప్రారంభించారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల కేవలం 36 మంది విద్యార్థినులతో కొనసాగింది. అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ల పరంగా సీట్లు కేటాయించడంతో మహిళల విద్యకు ప్రాధాన్యత కల్పించింది. విద్యార్థినులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పాఠశాల ముందుకు సాగుతున్నది. వికారాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది బాలికలకు విద్యనందించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాలలకు మరింత మెరుగైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్2017లో గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను అందజేయడంతో పాటు విద్య, సాంస్కృతిక నృత్యాలు, ఆటలు, పాటలు, క్రీడల్లో విద్యార్థినులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించేది. క్రీడా రంగాల్లో విద్యార్థినులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభను చాటారు. పాఠశాలలో ఇంటర్ విద్య ప్రారంభమైనప్పటి నుంచి ఎంపీసీలో 40 మంది, బైపీసీ 40 మంది విద్యనభ్యసించారు. ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విద్యార్థినీ తేజశ్రీ 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం పాఠశాలలో 680 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలిసే విధంగా విద్యార్థులతో బతుకమ్మ పండుగలు, బోనాలు తదితర పండుగలతో పాటు దేశ నాయకులు జీవిత చరిత్రలను సైతం విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పాఠశాల నిర్వహిస్తున్నది. మహనీయుల జయంతి, ర్యాలీలు, వేషధారణలు సైతం వేసి పాత్రలు పోషించేవారు. పాఠశాల విద్యార్థులు మిణుగురులు అనే పుస్తకంలో కవితా సంకలనం రాయడంతో పాఠశాలకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన బాలకవి సమ్మేళన కార్యక్రమంలో కస్తూర్భా పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని నందినికి రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చింది. పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థినులు ఒక్కొక్కరూ 100 పద్యాలు రాయడం, చదవడంలో ప్రావీణ్యం సాధించారు.
ఉచితంగా గ్రూప్ 1 కోచింగ్ ఇస్తున్నా..
వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. పాఠశాలలో విద్యాబోధన చాలా బాగుంది. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాను. 2017లో సివిల్ సర్వీస్ పరీక్ష రాసి గ్రూప్ 1కు ఎంపికయ్యాను. ప్రస్తుతం జోగులాంబ గద్వాల్లో జిల్లా ఉపాధి కల్పన అధికారిగా పని చేస్తున్నా. అదే కాకుండా కొంత మంది ఐఏఎస్లను తయారు చేసేందుకు ఖాళీ సమయాల్లో అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నా. నాతో పాటు మరికొంత మందిని తయారు చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నా.
– ప్రియాంక, జిల్లా ఉపాధి కల్పన అధికారి, జోగులాంబ గద్వాల్
ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకొనేవారు..
సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. ఉపాధ్యాయులు విద్యార్థినులపై శ్రద్ధ పెట్టి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. 2003లో 10వ తరగతి పూర్తి చేశాను. నాతో పాటు 80శాతం మంది వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇందులో చదివిన విద్యార్థులు టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు వంటి ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో అందులో చదువుకునేందుకు ఆసక్తి చూపాం. విద్యాబోధన చాలా బాగుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల వైద్యాధికారిగా పని చేస్తున్నా.
– రేవతి, మండల వైద్యాధికారి, శంకర్పల్లి
క్రమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాం
పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాం. అన్ని రకాల ఆటలు, పాటలు సైతం ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నాం. దేశ భక్తిని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయ పాలన పాటిస్తూ విద్యార్థులకు విద్యానైపుణ్యాలు అందిస్తున్నాం.
– మల్లికార్జున్ శాస్త్రీ, సంస్కృత ఉపాధ్యాయుడు