పరిగి, ఆగస్టు 23: వినాయక చవితి సమీపిస్తున్నది. ఊరూవాడా గణనాథుల సందడి కనిపించనున్నది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో రూపొందిన విగ్రహాలు కాకుండా సహజసిద్ధంగా మట్టితో తయారు చేసిన గణనాథుల విగ్రహాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కుమ్మరి కులవృత్తిని ప్రోత్సహించేందుకు మట్టి ప్రతిమల విక్రయానికి వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 2,542 మట్టి వినాయక విగ్రహా లు అందుబాటులో ఉండగా వాటిని అధికారులు పూర్తిస్థాయిలో విక్రయించి తయారీదారులకు ప్రోత్సాహాన్ని అందించనున్నది.
జిల్లాలో అందుబాటులో 2,542 మట్టి విగ్రహాలు
మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలు జిల్లాలో ప్రస్తుతం 2,542 అందుబాటులో ఉన్నా యి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లనున్నది. ప్రతిమలకు వినియోగించే వివిధ రకాల రంగులతో నీటి కాలుష్యం ఏర్పడనున్నది. ఫలితంగా వివిధ రకాల చర్మ వ్యాధులు రానున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల తయారీకి గత కొన్నేండ్లుగా ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇందు లో భాగంగా కులవృత్తులను ప్రోత్సహించేందుకు కుమ్మరులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులను కూ డా ఏర్పాటు చేసి మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించింది.
జిల్లాలోని వికారాబాద్లో ప్రస్తుతం 1,350 మట్టి వినాయక విగ్రహాలు అందుబాటులో ఉండగా.. ఆరు ఇంచుల ఎత్తు గలవి 400 విగ్రహాలు, ఎనిమిది ఇంచుల ఎత్తు గలవి 400, 10 ఇంచుల ఎత్తు ఉన్నవి 200, 2 ఫీట్ల ఎత్తు ఉన్నవి 50, 3 ఫీట్ల ఎత్తు గలవి150, 4 ఫీట్ల ఎత్తు ఉన్నవి 70, 5 ఫీట్ల ఎత్తు గలవి 50, 7 ఫీట్ల ఎత్తు ఉన్న 30 విగ్రహాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా తాండూరులో 1,000 విగ్రహాలుండగా వాటిలో 8 ఇంచుల ఎత్తు గలవి 300 విగ్రహాలు, 10 ఇంచుల ఎత్తు ఉన్నవి 400, ఒక ఫీట్ ఎత్తు గలవి 300 విగ్రహాలున్నాయి. కొడంగల్లో 192 విగ్రహాలుండగా.. వాటిలో 10 ఇంచుల ఎత్తు గలవి 180 విగ్రహాలు, 2 ఫీట్ల ఎత్తు గలవి 8 విగ్రహాలు, 3 ఫీట్ల ఎత్తు ఉన్న నాలుగు విగ్రహాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విక్రయాలకు తగిన ప్రోత్సాహం
కుమ్మరులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సహజసిద్ధ మట్టితో తయారు చేయించిన వినాయక విగ్రహాల విక్రయానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మట్టి గణనాథుడి విగ్రహాలను కొనుగోలు చేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ విజ్ఞప్తి చేసింది. పర్యావరణానికి మేలు చేసే ఈ విగ్రహాలను కొనడం ద్వారా కుమ్మరులకు ఆదాయం సమకూరడంతోపాటు వారు ఆర్థికంగా ఎదుగుతారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సిద్ధంగా ఉన్న విగ్రహాలను ఈ వారంలోగా విక్రయించేందుకు చర్యలు చేపట్టారు.
తయారీదారులను ప్రోత్సహించాలి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కుమ్మరి కులవృత్తిని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను కొనుగోలు చేయాలి. జిల్లాలో ప్రస్తుతం 2,542 మట్టి వినాయక విగ్రహాలు వివిధ సైజుల్లో అం దుబాటులో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారు లు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల వారు మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి తయారీదారులను ప్రోత్సహించాలి.
-ఉపేందర్, వికారాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి