మొయినాబాద్, ఆగస్టు 2 : పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్వచ్ఛ పాఠశాలను అప్గ్రేడ్ చేస్తూ నూతనంగా మండల పరిధిలోని ఎతుబార్పల్లి రెవెన్యూలో ఏర్పాటు చేసిన గురుకుల బాలికల జూనియర్ కళాశాలను మంగళవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ సురబి వాణీదేవి, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. గురుకుల విద్యా సంస్థ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పశ్చిమ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ శారద, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యనందించడానికి కేజీ టూ పీజీ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి, పోటీ పరీక్షలకు వెళ్లడం కోసం ప్రతి జిల్లాకు ఒక్క స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ల ద్వారా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. స్కాలర్షిప్లు పొందిన సుమారు 5వేల మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. తల్లిదండ్రుల ఆరాటం లాగే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నదని చెప్పారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని ఓ లక్ష్యంతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. గురుకుల పాఠశాలను ప్రారంభించడానికి మంత్రి, ఎమ్మెల్యే తదితరులు వెళుతుండగా.. మార్గమధ్యంలో తోలుకట్టా-ఎతుబార్పల్లి గ్రామాల మధ్య ఉన్న వాగులోకి భారీగా వరద నీరు చేరి రోడ్డు పైకి ప్రవహించింది. దీంతో వారు కారు దిగి వరద నీటిని పరిశీలించారు. అనంతరం వరద కాలువను దాటారు.
ఇంటర్ టర్నింగ్ పాయింట్
ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు ఇంటర్ ఓ మలుపు రాయి అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణించాలన్నారు. విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మంచి పౌష్టికాహారం అందిస్తున్నదని తెలిపారు.
నైతిక విలువలతో కూడిన విద్య అవసరం
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. సాంకేతిక విద్య శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని.. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం చాలా అవసరమని పేర్కొన్నారు. కళాశాలలను అద్భుతంగా నిర్వహించడానికి అధ్యాపకులు చాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
చిలుకూరులో బాలుర డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాకు బాలుర డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించిందని, దానిని చిలుకూరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. గురుకుల పాఠశాలల్లో సీటు పొందడానికి తీవ్ర పోటీతత్వం ఉందని, దీన్నిబట్టే గురుకుల పాఠశాలలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో అర్థమవుతున్నదని చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్లు నవనీత, శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంఈవో వెంకటయ్య, ఆర్ఐ పాండు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహరెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహగౌడ్, గణేశ్రెడ్డి, సుధాకర్యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, ఉపసర్పంచ్ రవీందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రవీందర్, మాణిక్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్రెడ్డి, రాజు, పరమేశ్, సునీల్, ఆంజనేయులుగౌడ్, రమేశ్ పాల్గొన్నారు.