వికారాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ప్రాథమిక రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల కోసం ఈ నెల 7న జరుగనున్న పరీక్షలకు జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. సుమారు 3,778 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బయోమెట్రిక్ సమయంలో ఎలాంటి సమస్య ఎదురు కాకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో సిబ్బంది, పరీక్ష హాల్లో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పాటించవలసిన నియమాలు సూచించాలని తెలిపారు. పరీక్ష హాలులో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లో సూచించిన నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సమస్యలుంటే 9393711110, 9391005006లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.ఏ.రషీద్, డీటీసీ అదనపు ఎస్పీ పీవీ మురళీధర్, రీజినల్ చీఫ్ సూపరింటెండెంట్ అబ్బాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.