పరిగి, మే 23: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణకు శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై అదనపు కలెక్టర్ మోతీలాల్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకను నిర్వహిస్తామన్నారు. ముఖ్యఅతిథిగా శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావు హాజరవుతారని పేర్కొన్నారు. వేడుకలను ఉదయం 9 నుంచి 10 గంటల వ్యవధిలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అవార్డు గ్రహీతలకు, మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స నిమిత్తం సిబ్బందిని ఏర్పాటుచేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సమావేశంలో వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విజయకుమారి, అశోక్కుమార్, జిల్లా అదనపు ఎస్పీ రషీద్, ముఖ్య ప్రణాళికాధికారి నిరంజన్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్, ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, వికారాబాద్ తహసీల్దార్ షర్మి పాల్గొన్నారు.
సేవలు అందించి గుర్తింపు పొందాలి
ప్రజలకు మంచి సేవలు అందించి గుర్తింపు పొందాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మోతీలాల్ బదిలీపై నాగర్కర్నూల్ జిల్లాకు వెళ్తున్న ఆయనకు జిల్లా యంత్రాంగం అభినందన(వీడ్కోలు) సభ నిర్వహించారు. జిల్లా అధికారులు, రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది జ్ఞాపికలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పని చేసినన్ని రోజులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన జిల్లా యంత్రాంగానికి, సిబ్బందికి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటాజీ, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, సీపీవో నిరంజన్రావు, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి, డీఈవో రేణుకాదేవి, వ్యవసాయాధికారి గోపాల్, డీవైఎస్వో హన్మంతరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్, పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశ్, ఆర్డీవో విజయకుమారి, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు సత్తయ్య, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బాలేశ్వర్గుప్తా, కలెక్టరేట్ పరిపాలనాధికారి హరిత, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.