పరిగి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా స్వచ్చత ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, బట్ట సంచులు వినియోగించాలని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల దోమలు, ఈగలు ప్రబలి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయన్నారు. ఇంటి పరిసరాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు రెండు బుట్టలు ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందని, తడి, పొడి చెత్తలను వేరుగా వేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజు చెత్త సేకరణకు వచ్చే వాహనాలలో చెత్త వేయాలన్నారు. ఇంటి పరిసరాలలో నీరు గుంతలలో నిలువ ఉండకుండా చూడాలని సూచించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతిలాల్, జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, సిబ్బంది పాల్గొన్నారు.