తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేటితో 20 వసంతాలు నిండాయి. ఒక్కడిగా మొదలైన ప్రస్థానం ఇప్పుడు రాజకీయ శక్తిగా మారేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మద్దతుతో టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తదనంతరం అన్ని శక్తులను, సంఘాలను ఐక్యం చేస్తూ, తొలిసారిగా 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. తొలి అడుగులోనే 26 ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను గెలిపించి ప్రజలు ఆశీర్వదించారు. ఈ విజయంతో యూపీఏ ప్రభుత్వంలోని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చడం తొలి విజయంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్లు వారి ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర అంశాన్ని ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా టీఆర్ఎస్ చేరగా కేసీఆర్కు కేంద్ర మంత్రి మండలిలో నౌకాయాన మంత్రిత్వ శాఖను కేటాయించారు. నౌకాయాన శాఖకై యూపీఏ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ డిమాండ్ చేయగా, పదవులు ముఖ్యంకాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని ఆ శాఖను సీఎం కేసీఆర్ వదులుకున్నారు. అనంతరం ఎలాంటి మంత్రిత్వ శాఖ లేకుండానే యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు.
రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ఆసక్తి చూపకపోవడంతో మంత్రి పదవిని త్యాగం చేశారు. అనంతరం అన్ని సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులను ఐక్యం చేసి జేఏసీగా ఏర్పాటై ఉద్యమం ఎగిసిపడేలా చేశారు. 2009 నవంబర్ 29న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ నిరవదిక నిరాహార దీక్ష చేపట్టగా, అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా యావత్ తెలంగాణ ఉద్యమబాట పట్టింది. దీంతో చరిత్రలో నిలిచిపోయేలా 10 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడడంతోపాటు అంతా స్తంభించిపోయింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. సీమాంధ్ర నేతల లాబీయింగ్తో రెండు వారాల్లోనే మాటమార్చింది. కేసీఆర్ అన్ని రాజకీయ శక్తులను ఏకం చేసి మరో నాలుగేండ్లపాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 2013 జూలైలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఇందుకు ఫలితంగా 2014 ఏప్రిల్-మే మాసంలో జరిగిన తొలి ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నది. మళ్లీ 88 స్థానాల్లో గెలువగా, రెండోసారి సీఎం కేసీఆర్కు జనం జై కొట్టారు.
వికారాబాద్ జిల్లాలో హరితవిప్లవంతో పాటు క్షీరవిప్లవం, పింక్ విప్లవం(మాంసం), నీలివిప్లవం(చేపలు), శ్వేత విప్లవం(పాలు), జల విప్లవం ఆవిష్కృతమైంది. పెట్టుబడి సాయంతో దేశానికే ఆదర్శంగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బంగారు తెలంగాణయే లక్ష్యంగా పాలన సాగిస్తున్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో రాష్ర్టాన్ని సస్యశామలం చేయడంతో పాటు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటు కేంద్రాన్నికి .. అటు మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. సీఎం కేసీఆర్ వ్యూహాలకు జాతీయ పార్టీ కాంగ్రెస్కు ప్రతి పక్ష పార్టీ హోదా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకలు సింపుల్గా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగుర వేయనున్నారు. మొత్తం మీద 20 ఏండ్ల కింద పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తిరుగులేని ..ఎదురులేని శక్తిగా ఎదిగింది.దేశంలో ఫెడరల్ ఫ్రంట్ గుణాత్మక మార్పును తీసుకొస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.