వికారాబాద్/కొడంగల్ : రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లోని రైతు వేదికల ఎదుట అన్నదాతలు, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు పెట్టుబడి సాయాన్ని జమ చేసిన సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా రైతు బంధు పథకం కొనసాగుతున్నదని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మోమిన్పేటలోని రైతు వేదికలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గినా అన్నదాతల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ మరిచిపోలేదని, ఏటా రెండు పంటలకు పెట్టుబడి సహాయాన్ని అందజేసి ఆదుకుంటున్నాడని తెలిపారు.
పెట్టుబడి సాయం టైమ్కు వచ్చింది : బస్వరాజ్, రైతు, బంట్వారం
సర్కార్ ఇస్తున్న పెట్టుబడి సాయం టైమ్కు వచ్చింది. లేకుంటే అప్పు చేయాల్సి వచ్చేది. బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా.. ఇప్పటికే అప్పు ఉంది. ఇక ఇప్పుడు వచ్చిన డబ్బుతో చింత లేకుండా ఉంది.
దళారుల పెత్తనం పోయింది రాములు, రైతు, ఓగ్లాపూర్
గతంలో రైతులు విత్తనాలు వేసుకోవాలంటే దళారుల వద్దకు వెళ్లి అప్పు తెచ్చేవారు. పంట అయ్యాక అమ్మే డబ్బులు అప్పులకే సరిపోయేవి. లాగోడికి ప్రభుత్వం సాయం అందించడంతో ఎంతో సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు.
కేసీఆర్ వచ్చాకే రైతుకు మేలు జరిగింది : వి.కళావతి, రైతు, కోట్పల్లి
సీఎం కేసీఆర్ వచ్చాకే రైతుకు మేలు జరిగింది. అంతకుముందు ఎన్నో కష్టాలను ఎదుర్కునేవాళ్లం. ఇప్పుడు దళారుల వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకునే అవసరం లేకుండా పంట పెట్టుబడి సాయాన్ని ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాం. మా దేవుడు కేసీఆర్ మా మదిలో ఎల్లప్పుడూ నిలిచిఉంటారు.
అప్పులు తగ్గాయి : వినయ్కుమార్, ఏడీఏ, కొడంగల్
పంట సాగు కోసం రైతులు గతంలో వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడి వారి నుంచి నగదు తెచ్చుకునేవారు. పంటను కూడా వారికే అమ్మకాలు చేపట్టి, అప్పులు తీర్చుకునేవారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురువడం, ప్రభుత్వం పంట సాగుకు పెట్టుబడి సాయం అందించడంతో సాగు గణనీయంగా పెరిగింది.