పెద్దేముల్ : 108 అంబులెన్స్ వాహనాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని వికారాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ దిలీప్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ వాహనాన్ని తనిఖీ చేసి వాహనంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల మందులను, వాహనానికి అమర్చిఉన్న పలు రకాల పరికరాల పనితీరును, రికార్డుల నిర్వహణను, వాహన పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 108వాహనాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా ప్రతి కేసు పూర్తయిన తరువాత యథావిధిగా హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరుచాలని తెలిపారు. మండలంలో విధులు నిర్వహిస్తున్న 108సిబ్బంది చాలా చురుగ్గా పనిచేయడం అభినందనీయమని, అదే విధంగా ప్రజలకు ఎల్లప్పుడు 108వాహనాన్ని అందుబాటులో ఉంచుతూ మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. ముఖ్యంగా సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఉన్నతాధికారులు సూచించిన విధంగా రికార్డులను నిర్వహణను చేపట్టాలని కోరారు. తనిఖీల సమయంలో ఈఎంటీ వెంకటేష్, పైలట్ నర్సింహరెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు.