ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల పని తీరును ఆయన పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా తరువాత తెరుచుకున్న పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నామని, ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం పాఠశాలల అబివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తుందన్నారు.
ఎమ్మెల్యే నిధుల్లో నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల ప్రకారం.. పోస్టులను కేటాయించి త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పండిత్ పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారంతో పాటు పాఠశాలలో విద్యుత్ సరఫరా చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ పీఆర్టీయూ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు వర్కాల పరమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్యాదవ్, గౌరవాధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, పీర్టీయూ ఉపాధ్యాయులు కేశవరెడ్డి, రామాంజున్, జగన్మోహన్, భూపాల్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.