పరిగి, డిసెంబర్ 6 : యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు. సోమవారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు యాసంగి సీజన్లో ఉత్పత్తి చేసే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనడం లేదన్నారు. అందువల్ల యాసంగిలో రైతులు పండించే వరి ధాన్యాన్ని కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. వరి పంట వేసి రైతులు నష్టపోరాదని సూచించారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసి లాభం పొందాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి రైతును కలిసి యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా వ్యవసాయాధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలి
యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండలం వెంకమ్మగూడ, మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామాలను సందర్శించి ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగిలో పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాల్లో రైతులందరికీ ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు వరి వేసి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలో ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు గ్రామాల్లో రైతులకు ఇతర పంటల సాగుపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయాధికారి వెంకటేశం, ఏఈవోలున్నారు.
ఇతర పంటలు సాగు చేసుకోవాలి
రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఏడీవో వినోద్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఏవో రాధారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వరియేతర పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయడంలేదని.. యాసంగిలో సాగు చేసే వరికి ప్రభుత్వం అండ ఉండదన్నారు. కొనుగోలు కేంద్రాలను కూడా ఉండవని స్పష్టం చేశారు. వరి సాగు చేస్తే రైతులు తమ పంటను అమ్ముకునేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇతర పంటలపై రైతులకు ఏఈవోలు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు పాల్గొన్నారు.