వికారాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పేదల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున బియ్యం పంపిణీతోపాటు కుటుంబ సభ్యుల్లోనూ కేవలం ఐదు మందికి పరిమితం చేస్తూ నిబంధనలు వర్తింపజేసేవారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆహార భద్రత పథకం తీసుకువచ్చి ఒక్కో రేషన్కార్డుదారుడికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడంతోపాటు కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా.. ఎలాంటి పరిమితి లేకుండా అందరికీ 6 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న సీఎంఆర్ బియ్యంలో పోషక విలువలు గల బియ్యాన్ని కలిపి పేద ప్రజలకు పంపిణీ చేసేందుకుగాను చర్యలు చేపట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు గల బియ్యాన్ని పేద ప్రజలకు కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోషకాలు కలిగిన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో ప్రస్తుతం 558 రేషన్ దుకాణాలుండగా, 2.41 లక్షల రేషన్ కార్డులు, 8.48 లక్షల మంది లబ్ధిదారులున్నారు.
ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ
వచ్చే ఏడాది నుంచి ఏప్రిల్ నుంచి పోషకాలు గల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందించేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి మిల్లుల్లో బ్లెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్లెండింగ్ యంత్రాలను సమకూర్చుకున్న రైస్మిల్లర్లకే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అనుమతులివ్వనున్నారు. 100 కిలోల సీఎంఆర్ బియ్యంలో ఒక కిలో ఎఫ్ఆర్కే(ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్) బియ్యాన్ని బ్లెండింగ్ యంత్రం ద్వారా కలిపి రైస్ మిల్లుల్లోనే ప్యాక్ చేసి రేషన్ దుకాణాలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతానికి జిల్లావ్యాప్తంగా 58 రైస్ మిల్లులు ఉండగా.. వీటిలో 53 రైస్ మిల్లులకు సంబంధించి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చింది. కిలో రూ.50 విలువ గల సంబంధిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్ బియ్యంతో భోజనాన్ని గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు.
మార్చి నెలాఖరులోగా సరఫరా
రైస్మిల్లుల నుంచి రేషన్ దుకాణాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మార్చి నెలాఖరులోగా సరఫరా చేసి, ఏప్రిల్లో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. కొవిడ్ సమయం నుంచి జిల్లాలో ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి ప్రస్తుతం 10 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కొవిడ్ వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే ఒక్కో లబ్ధిదారుడికి రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేసే బియ్యం స్థానంలో ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించిన దృష్ట్యా కిలోకు మరో 50 పైసలు లేదా రూపాయి వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు: విమల, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందించే సీఎంఆర్ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలిపి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 53 రైస్ మిల్లుల నిర్వాహకులు బ్లెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకొని సీఎంఆర్ బియ్యంలో ఎఫ్ఆర్కే బియ్యం కలిపి ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొందారు. జిల్లాలోని 8.48 లక్షల మంది రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా 7500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం.
పోషకాలు ఇలా..
ఈ బియ్యం మనిషి ఎదుగుదలకు, నరాల వ్యవస్థను బలోపేతం చేయడంలో, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో, రక్తహీనత కాకుండా పెంపొందించడం, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 పోషకాలు తోడ్పడనున్నాయి. కిలో ఫోర్టిపైడ్ బియ్యంలో 3525 మైక్రోగ్రాముల ఐరన్, 10,000 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, 100 మైక్రోగ్రాముల విటమిన్ బి-12 మిశ్రమాలు ఉండనున్నాయి.