వికారాబాద్, ఆగస్టు 1 : దళిత బంధు పథకంతో ఉన్నతమైన స్వయం ఉపాధి పొందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం ముందు దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో.. దేశంలోనే మొదటి సారిగా దళితబంధు పథకం ప్రారంభించిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమాల్రెడ్డి, సర్పంచ్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.