మహేశ్వరం : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. శుక్రవారం సిరిగిరిపురం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్(CM KCR) సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు బీఆర్ఎస్పై బురద జల్లె రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్తోనే శ్రీరామ రక్ష అని అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తడకల పోచయ్య నాయకులు వెంకటేశ్గౌడ్, నర్సింహా, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
మహేశ్వరం మండలంలోని 610 మంది రైతులకు రూ. 2. 50 కోట్లు రుణ మాఫి కావడంపై పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, నర్సింహ , రాకేశ్రెడ్డి మాణిక్యమ్మ తదితరులు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని అన్నారు. రైతులను రాజులను చేయడానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు.