పహాడీషరీఫ్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy )అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్థన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కురుమ కుటుంబ సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ (CM KCR ) అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకెళ్తుందన్నారు. కాలనీ, బస్తీలలో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులు జోరుగా సమకూరుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కొరకు కష్టపడి పని చేయాలన్నారు.
పార్టీలో పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. చేస్తున్న అభివృద్ధిని కళ్లారా చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత బీఆర్ఎస్లోకి చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు.
అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమనెంతో పార్టీవైపు ఆకర్షించేలా చేశాయన్నారు. తమ కాలనీ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ, సమస్యలు తెలుసుకుంటూ చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సూరెడ్డి సత్తిరెడ్డి, దూడల శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.