వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి, డీఆర్డీవోతో కలిసి హరితహారంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో ఈసారి గతంలో కన్నా భిన్నంగా పెద్ద ఎత్తున పెద్ద సైజు మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేసి జిల్లాను పచ్చగా చేయాలన్నారు. ఇందుకు గాను స్థలాలను గుర్తించి 5 రోజులలో గుంతలు తవ్వే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మన్నెగూడ నుంచి కొడంగల్ వరకు జాతీయ ప్రధాన రహదారులపై మూడు వరుసలలో డీఎఫ్వో ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటాలని ఆదేశించారు. అవసరమైన 50 వేల మొక్కలు హెచ్ఎండీఏ నుంచి సేకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న గ్రీన్ బడ్జెట్ 100 శాంతం వినియోగించుకోవాలన్నారు.
తాండూర్ పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. మైనింగ్, సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల భాగస్వామ్యంతో మొక్కలు నటించాలని మైన్స్ అధికారికి సూచించారు.
పాఠశాలలు, రైస్ మిల్లులు, అంగన్వాడీ కేంద్రాలల్లో కూడా మొక్కలు నాటించాలన్నారు. జూన్ మాసంలో జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నందున వికారాబాద్ పట్టణంలో మూడు వరుసలలో అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్వో వేణుమాధవ్,డీఆర్డీవో కృష్ణన్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.