వికారాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నాలుగో రోజు జిల్లాలో 7014 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1159 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 543 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదల్లో కంటి వెలుగు ధైర్యం నింపుతుంది.
రంగారెడ్డిజిల్లాలో..
షాబాద్ : కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన కంటి వెలుగు తమ జీవితాలకు కొత్త వెలుగునిచ్చిందని ప్రజలు చెబుతున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మంగళవారం 80 బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు క్యాంపులలో 14,808 మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్లు సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9గంటల నుంచి క్యాంపులు ప్రారంభమవుతుండడంతో ప్రజలు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి, ప్రజలకు చేసే కంటి పరీక్షలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పకడ్బందీగా కంటి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా తమకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడం సంతోషకరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,808 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,251 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,860 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ పేదల దేవుడు..
సీఎం కేసీఆర్ పేదల దేవుడు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టాడు. కండ్ల అద్దాల గురించి అడిగిన వారు ఎవరూ ఉండరు. కానీ ప్రజల మనసును తెలుసుకుని కంటి పరీక్షలు చేయిస్తున్నాడు. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తుండ్రు. బయట పరీక్షలు చేసి అద్దాలు తీసుకుంటే కనీంస రూ.3వేలు ఖర్చు అవుతుంది. సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సేవలు సంతోషకరం.
– షేక్బషీర్, మొయినాబాద్
కంటి వెలుగు మంచి కార్యక్రమం
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమం. కంటి చూపు తగ్గి బాధపడే పేద ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతాయి. అలాంటిది సీఎం కేసీఆర్ కంటి వెలుగు వైద్య శిబిరాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేయడం పేదలకు ఎంతో మేలు కలిగిస్తుంది. నేను గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో ఉచితంగా కండ్లద్దాలు ఇచ్చారు.
-వడ్ల జనార్ధన్, చిల్ముల్మైలారం, దుద్యాల మండలం
పేద కుటుంబానికి కంటి వెలుగు
గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన పాపాన పోలేదు, కానీ సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరం. కంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడినం. కనీసం దవాఖానకు వెళ్లినా డబ్బులు ఖర్చుతో పాటు సమయం వృథా అయ్యేది. కానీ సీఎం కేసీఆర్ సారు పెద్ద మనస్సుతో మా వద్దనే శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలను నిర్వహించి, అద్దాలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. – పలుమారి శాస్త్రి, (గామం. కోట్పల్లి)
సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ కంటి వెలుగు రెండో విడుత శిబిరాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది. మా గ్రామానికి వచ్చి వైద్యులు ఉచిత పరీక్షలను నిర్వహించి, అద్దాలను అందించి, ఉచితంగానే మందులు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– తోలు లక్ష్మి, గ్రామం కోట్పల్లి
ఊర్లకే వచ్చి పరీక్షలు చేయడం సంతోషకరం
రూపాయి ఖర్చు లేకుండా ఊర్లకే వచ్చి కంటి పరీక్షలు చేయడం సంతోషకరం. కంటి సమస్యలతో ప్రైవేట్ దవాఖానలకు వెళితే డబ్బులు తీసుకుని పరీక్షలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ పేద ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేయడం గొప్ప పరిణామం. మా గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులో నాకు కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఉచితంగా మందులతో పాటు కంటి అద్దాలు అందజేశారు.
– గౌండ్ల శివరాజ్, చందనవెళ్లి(షాబాద్)
చాలా సంతోషంగా ఉంది..
రూపాయి ఖర్చు లేకుండా ఉన్న ఊర్లకే వచ్చి కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది పేదవారు చూపు మందగించి ఇబ్బందులు పడటాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారిలో కొత్త వెలుగులు నింపుతున్నాడు. మీమంతా సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– చెన్నయ్య, ఆలూరు గ్రామం, చేవెళ్ల మండలం
దగ్గరి చూపు కంటి సమస్య ఉన్నది..
ముసలోళ్లకు మాత్రమే కంటి చూపు ఇబ్బంది ఉంటుంది, మాకు ఉండదు అని అనుకున్నా. కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి పరీక్ష చేసుకుందామనే ఉద్దేశంతో కొడంగల్ ప్రభుత్వ దవాఖానలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులో పరీక్ష చేసుకున్నా. దగ్గర చూపు ఇబ్బంది ఉందని గుర్తించి కంటి అద్దాలు అందించారు. ఇప్పుడు చిన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంటి పరీక్ష చేయించుకోకుంటే మునుముందు మరింత చూపు ఇబ్బంది ఎదురయ్యేది.
– సుమన్దేవి, రావులపల్లి, కొడంగల్
గ్రామ ప్రజలకు ఉపయోగం..
గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి పరీక్షలు చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే దవాఖాన సౌకర్యాలు ఉండవు. కంటి పరీక్షలు చేసుకోలేం. పట్టణాలకు వెళ్లి ప్రైవేటు దవాఖానల్లో పరీక్ష చేసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దాంతో ఉన్న వరకు సర్దుకు పోతున్నాం. ఇప్పుడు కొడంగల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగులో కంటి పరీక్ష చేసుకున్నాం. దగ్గరి చూపు సమస్యను వైద్యులు గుర్తించి అద్దాలు అందించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. – నసీమాబేగం, రావులపల్లి, కొడంగల్
కంటి అద్దాలు ఇచ్చిండ్రు..
నాకు 70 ఏండ్లు దాటినయి.. బాట పొంటి నడవటానికి కండ్లు కనిపిస్తలేదు.. కండ్లు చూసి అద్దాలు ఇస్తున్నారని తెలిసింది. పరీక్షించి కంటి అద్దాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారు పేదలకు మేలు చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. నాలాంటి వృద్ధులకు కంటి చూపు ఎంతో అవసరం. అలాంటి వారి కోసం కంటి వెలుగు కార్యక్రమంతో ఎంతో మందికి కండ్లద్దాలు ఇచ్చి ఉచితంగా మందులు ఇస్తుండ్రు.
– కాడిగల్ల బాలమ్మ, చిలుకూరు, మొయినాబాద్