ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికే ఈ ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే కేసీఆర్ చేపట్టిన సీతారామ ప్రాజెక్టు లక్ష్యం. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల తరబడి ఈ ప్రాజెక్టు పనులను పెండింగ్లో పెట్టింది. ఆ తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగి.. సీతారామ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు. పైగా, తమ తమ నియోజకవర్గాలకు మేలు జరిగేలా కాలువల అలైన్మెంట్ను మార్చుకున్నారు.
ఇందులో భాగంగానే ఏన్కూరు సమీపంలోని సీతారామ ప్రధాన కాలువకు అడ్డుకట్ట వేశారు. కృష్ణా నదిలో నీళ్లు లేని సమయంలో ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) ఆయకట్టుకు గోదావరి నీళ్లను మళ్లించేందుకు, దాంతోపాటు తమ నియోజకవర్గాలకూ ఆ నీళ్లను తరలించుకునేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఏన్కూరు వద్ద ‘రాజీవ్’ పేరిట లింక్ కెనాల్ నిర్మించి ఎన్ఎస్పీ ప్రధాన కాలువకు లింక్ చేశారు. అయితే, ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ లింక్ కాలువను కూడా నాసిరకంగా నిర్మించారు. నిరుడు మార్చి నెలలో యాసంగి పంటల కోసమంటూ అప్పుడు ఇదే కాలువలో స్వల్పంగా నీళ్లు విడుదల చేశారు. తాజాగా, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వానకాలం పంటల కోసం కూడా రెండోసారి నీటిని విడుదల చేశారు.
అయితే, ఈ రెండోసారి పారిన నీళ్లకే ఆ కాలువకు ఇరువైపులా ఉన్న సిమెంటు బర్ములు/ పలకలు కుంగిపోయాయి. ఆ తరువాత ఏకంగా నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే లింక్ కాలువలోని సిమెంటు పలకలు పారే నీళ్లలో కొట్టుకెళ్తున్నాయని మండిపడుతున్నారు. అదీగాక, రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ కాలువ పలకలు దశాబ్దాలపాటు మన్నికగా ఉండకుండా.. నిర్మించిన కొద్ది రోజులకే తుడిచిపెట్టుకుపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏన్కూరు మండలంలో రూ.72 కోట్లతో నిర్మించిన రాజీవ్ లింక్ కాలువ సైడ్ బర్ములు శుక్రవారం కుంగిపోయి నీళ్లలో కొట్టుకుపోయాయి. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ఉదయమే కథనాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం ఆగమేఘాల మీద అదేరోజు సాయంత్రానికి మరమ్మతులు చేపట్టింది. అయితే, ఆ మరుసటి రోజైన ఆదివారం నాడు ఏన్కూరుకు పొరుగునే ఉన్న జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద కూడా అదే కాలువలో రెండు వైపులా ఉన్న బర్ములు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో ఇక్కడ కూడా రూ.80 కోట్లతో నిర్మించిన సిమెంటు పలకలు గంగలో కలిసినట్లయింది. అయితే, ఏడాదిన్నర క్రితమే ఈ కాలువను జిల్లా మంత్రులు అట్టహాసంగా పారంభించడం, రెండోసారి నీళ్లు విడుదల చేసినప్పుడే ఒక్కసారిగా కొట్టుకుపోవడంతో స్థానిక రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ రాజీవ్ లింక్ కాలువలో శుక్రవారం ఏన్కూరు వద్ద సిమెంటు పలకలు కొట్టుకుపోగా.. వెంటనే ప్రభుత్వం హడావిడిగా నీటి ప్రవాహాన్ని ఆపి మరమ్మతులు చేపట్టింది. ఆదివారం మళ్లీ వదిలే సరికి.. జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలో ఆ వరద ప్రవాహానికి సైడ్ బర్ములు మళ్లీ కూలిపోయి కొట్టుకుపోయాయి. అయితే, ఇక్కడ కాలువ భారీగా కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద గండ్లు పడే ప్రమాదమూ లేకపోలేదని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా తమ పంటలూ ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నిర్మాణ డిజైన్ను.. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే, అనుమతులు లేకుండానే ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంది. భూములు కోల్పోయిన భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వకుండానే రంగంలోకి దిగింది. జూలూరుపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి వినోభానగర్ మీదుగా ఏనూరు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వరకు రూ.80 కోట్లతో రాజీవ్ లింక్ కాలువను నిర్మించింది.
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం మూడు నెలల్లోనే ఈ రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని హడావిడిగా పూర్తి చేయించారు. కానీ, ఈ వేగంలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారు. అందుకు.. రెండోసారి వచ్చిన వరద ప్రవాహానికే కొట్టుకుపోయిన ఈ లింక్ కాలువ సైడ్ బర్ములే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.