రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వృద్ధాప్య పింఛన్ల లైవ్ సర్టిఫికేషన్ (లైవ్ అథెంటికేషన్)లోనూ కరీంనగర్ నగరపాలక సిబ్బంది వసూళ్లకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. చేతివాటం ప్రదర్శిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు దండుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలనే డిమాండ్ వృద్ధుల నుంచి వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులకు సంబంధించి లైవ్ అథెంటికేషన్ చేపట్టింది. గత నెలలో కరీంనగరంలోని అన్ని డివిజన్లలో ప్రారంభించింది. వృద్ధాప్య పింఛన్దారుల నుంచి వేలి ముద్రలు, ఫేస్ చిత్రాలను తీసుకుంటారు. ఆయా డివిజన్ కార్యాలయాల్లో వార్డు ఆఫీసర్లు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 29 వేలకు పైగా వృద్ధాప్య పింఛన్లు అందిస్తుండగా, ఇప్పటికే వరకు 26 వేలకు పైగా అథెంటికేషన్ పూర్తి చేశారు.
ఈ లైవ్ సర్టిఫికేషన్ చేయని వారికి ఈ నెల వృద్ధాప్య పింఛన్ రాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెంది ఈ విషయంపై ఆరా తీయగా, లైవ్ సర్టిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. అందు కోసం నగరపాలక సంస్థ పింఛన్ విభాగంలో సిబ్బందికి విధులు కేటాయించారు. కాగా, ఈ కార్యక్రమంలోనూ సంబంధింత సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. లైవ్ అథెంటికేషన్ కోసం వస్తున్న వృద్ధులు గంటల తరబడిగా వేచి ఉండలేక అవస్థలు పడుతున్నారు. పింఛన్ విభాగంలో సరైన లైటింగ్ లేదన్న సాకు చూపించి ఈ సిబ్బంది పౌర సేవా కేంద్రం కార్యాలయం ముందు చెట్ల వద్దకు వృద్ధులను తీసుకువచ్చి ఫొటోలు తీసుకుంటూ వసూళ్లకు తెగబడుతున్నారు.
ఒక్కొక్కరు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తేనే వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పంపిస్తున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఆ విభాగంలోని అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలోని అధికారులు, సిబ్బంది వృద్ధులపై ఛీదరింపు తీరుతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నగరపాలక ఉన్నతాధికారులు దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వస్తున్నాయి.