పరిగి టౌన్, ఆగస్టు 26 : ఐక్యతతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి మినిస్టేడియం ఆవరణలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మహేష్రెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్న మీ విజ్ఙప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గాను ఇటీవల పరిగిలో 5 కోట్ల రూపాయలతో నూతనంగా ఎస్టీ గురుకులాన్ని ప్రారంభించుకున్నామని, గిరిజన తండాలకు బిటి రోడ్డు వేసేందుకు 25 కోట్లు మంజూరైనాయని త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, గిరిజన సంఘం నాయకులు జీవన్లాల్, రాంబాబు, గాంగ్యనాయక్, శంకర్నాయక్, హరిలాల్, శాంతిబాయి తదితరులు పాల్గొన్నారు.