పరిగి, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిలో దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసిన సెంట్రింగ్ మెటీరియల్, డి.జె. సౌండ్ సిస్టమ్ దుకాణం, టిఫిన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం దళితులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రూ.10లక్షలు గ్రాంటుగా అందజేసే ఏకైక పథకం దళితబంధు అని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 100 మందికి దళితబంధు కింద లబ్ధి చేకూరగా, ఈసారి 1500 మందికి అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవొ జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వినయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, తదితరులు పాల్గొన్నారు.