ఒక్కో పథకం అమలు చేస్తుంటే దేశమంతా నివ్వెరపోయి రాష్ట్రం వైపే చూస్తున్నది.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తుంటే వాటి తీరుతెన్నులు పరిశీలించి అనేక రాష్ట్రాలు ఆయా చోట్ల ప్రారంభించాయి.. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే దిశానిర్దేశం చేస్తున్న సీఎం కేసీఆర్ చొరవతో ప్రారంభమవుతున్న దళితబంధు పథకం కొత్త చరిత్రకు నాందిగా మారనున్నది.. అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. దళితబంధు ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చేయూతనివ్వడంతో పాటు వారు మరికొందరికి ఉపాధి కల్పించే మహత్తర పథకమని ఆమె వివరించారు. నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉమ్మడి జిల్లాలో ఈ పథకం అమలు తీరును ఆమె వివరించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపికచేసి, వచ్చే నెలాఖరులోగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి సలహాలు, సూచనలిచ్చి.. వారు చేయాలనుకున్న వ్యాపారంలో శిక్షణనిచ్చి, వ్యాపారం తీరును పర్యవేక్షించి వారు వ్యాపారాన్ని విజయవంతంగా నడుపగలిగే స్థాయికి తీసుకువెళ్లడమే ఈ పథకం ఉద్దేశమని ఆమె వివరించారు. మధ్యవర్తులు, దళారుల ఊసే లేకుండా, ష్యూరిటీలాంటివేవీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా పదిలక్షల రూపాయలిచ్చి, ఎక్కడైనా, ఏ వ్యాపారమైనా చేసుకునే వెసులుబాటు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని12 నియోజకవర్గాల్లో మొదటగా 1200 మందికి ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.
-రంగారెడ్డి, జనవరి 27, నమస్తే తెలంగాణ
‘సమాజంలో అట్టడుగువర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దళిత బంధు పథకం ఓ చరిత్రాత్మక నిర్ణయం. ఈ పథకం అమలుతో సామాజిక మార్పు తథ్యం. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో పుట్టుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా పథకాలను ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారో దళిత బంధు పథకం కూడా దేశమంతా తెలంగాణ వైపు తిరిగి చూసేలా ఉంటుంది. ఆ వర్గానికి ఎంత చేసినా తక్కువే కాబట్టి దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకంతో రానున్న రోజుల్లో దళితులు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా దళితులు సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరనుంది, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తి కానుంది, ఎప్పటిలోగా గ్రౌండింగ్ కానుంది, దళిత బంధు పథకంతో ఎలాంటి మార్పు రానుంది, దళిత బంధు కింద రూ.10లక్షలు మంజూరు చేసి వదిలేస్తారా, పర్యవేక్షణ ఉంటుందా తదితర వివరాలపై మంత్రి సబితారెడ్డితో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ…
నమస్తే తెలంగాణ : దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
మంత్రి సబితారెడ్డి : సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. కేవలం సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాకుండా దళిత వర్గాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయం. అంతేకాకుండా దళిత వర్గాలను ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధును అమల్లోకి తెచ్చారు. దళిత సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. దళిత బంధు పథకమనేది చరిత్రాత్మక నిర్ణయం.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తి కానుంది?
మంత్రి : లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈనెలాఖరులోగా ఎంపిక పూర్తి చేసి ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు చేపట్టాం. లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి పొందే రూ.10లక్షల ఆర్థిక సాయానికి సంబంధించి ఎలాంటి ష్యూరిటీ పెట్టాల్సిన అవసరంలేదు, బ్యాంకుకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరంలేదు. లబ్ధిదారుల ఎంపికలో, గ్రౌండింగ్ మంజూరులో మధ్యవర్తులు, దళారుల ప్రస్తావన ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండబోదు.
నమస్తే : యూనిట్లను గ్రౌండింగ్ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ ఏమైనా ఉంటుందా?
మంత్రి : లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేసిన అనంతరం అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది. వ్యాపారం ఎలా జరుగుతుంది, ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే వ్యాపార మెళకువలు నేర్పించడం, అవసరమైన సహాయ, సహకారాలు అందించనున్నారు. లబ్ధిదారులు వ్యాపారంలో రాణించి,ఆర్థికంగా బలోపేతమయ్యేవరకు పర్యవేక్షిస్తుంటారు.
నమస్తే : యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు ఏమైనా వెసులుబాటు కల్పించారా?
మంత్రి : యూనిట్ల ఎంపికలో లబ్ధిదారుల నిర్ణయమే తుది నిర్ణయం. లబ్ధిదారులకు నచ్చిన యూనిట్ను ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ను కమిటీల ఆధ్వర్యంలో సమకూర్చనున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్కు సంబంధించి నైపుణ్యాన్ని పొందేందుకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నమస్తే తెలంగాణ : రక్షణ నిధితో ఎలాంటి ప్రయోజనముంటుంది?
మంత్రి సబితారెడ్డి : దళిత బంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేసేందుకు చర్యలు చేపట్టాం. లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10లక్షల యూనిట్లో రూ.10వేలతో రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.
నమస్తే : ఈ పథకంతో ఎలాంటి మార్పు రానుంది ?
మంత్రి : ఈ పథకంతో అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం భరోసానందిస్తుంది. దళిత బంధు అమలైతే ఆ వర్గాలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరంలేదు. ఆర్థిక ఇబ్బందే పెద్ద సమస్య కాబట్టి ఆ అడ్డంకిని తొలగించేందుకే ప్రభుత్వం ప్రోత్సాహమందిస్తున్నది. దళిత వర్గాలు ఆర్థికంగా ఎదిగినట్లయితే వారి పిల్లలకు నాణ్యమైన చదువును అందించడంతోపాటు గౌరవప్రదంగా బతుకుతారు. అంతేకాకుండా వారు పది మందికి చేయూతనిచ్చేలా ఎదుగుతారు. పథకం అమలుతో వచ్చే సామాజిక మార్పు తథ్యం. రాబోయే రోజుల్లో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
నమస్తే : యూనిట్లను గ్రౌండింగ్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
మంత్రి : ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిబ్రవరి ఆఖరులోగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూస్తాం. మార్చి 7లోగా లబ్ధిదారులందరూ వారు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి వ్యాపారాలు ప్రారంభించేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాం.
నమస్తే : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది?
మంత్రి : నియోజకవర్గానికి వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయనున్నాం. ఉమ్మడి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని 4 మండలాలను కలిపి మొదటి దఫాలో 1200 మందికి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున మార్చి 7లోగా మంజూరు కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కుటుంబాలు-118514, వికారాబాద్ జిల్లాలో 54,324 కుటుంబాలున్నాయి.
నమస్తే : వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చా, స్థానికంగానే చేసుకోవాలా?
మంత్రి : ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సాయంలో తమ వ్యాపారాలను జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా వ్యాపారంలో భాగంగా ఒకేసారి రూ.10లక్షలను ఖర్చు చేయాలని కూడా నిబంధనలేమీ లేవు. తొలుత రూ.2లక్షలు, తర్వాత రూ.5లక్షలు, తదనంతరం మిగతా డబ్బులను వ్యాపారం నిమిత్తం ఖర్చు చేసుకోవచ్చు. ఎంపికైన సంబంధిత దళిత కుటుంబంలో ముగ్గురు కొడుకులుంటే మూడు రకాల వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. రెండు కుటుంబాలు కలిసి పెద్ద వ్యాపారం కూడా చేసుకోవచ్చు. యూనిట్ల ఎంపికతోపాటు వ్యాపారం నిర్వహణలోనూ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.