వికారాబాద్, మే 15 : ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్సిన వివిధ అంశాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహన్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వారికి అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఒక్క శాతం ఉన్న ఉద్యోగులుగా మనం 99 శాతం ఉన్న ప్రజలకు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రైతులు సన్న రకం బియ్యాన్ని పండించే విధంగా ప్రోత్సహించాలని తెలుపుతూ, సన్న బియ్యం పండించే వారికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో పాటు అన్ని కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందించే లక్ష్యంగా చౌక ధర దుకాణంల ద్వారా సన్న బియ్యాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కలిగేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
రైతు భరోసా, రుణమాఫీ పథకం వివరాలను ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారిని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అదే విధంగా విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొంచేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా పారిశుద్ధ్య వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం రెవెన్యూ సమస్యలు పరిష్కరించే దిశగా భూ భారతి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించిందని, ప్రజల సమస్యల పరిష్కార దిశగా అధికారులు అంకితభావంతో పని చేయాలని అధికారులకు ఆయన సూచించారు.\