కందుకూరు ( హైదరాబాద్ ) : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) ఆరోపించారు. కందుకూరు మండలం గూడూరు, మాదాపూరు గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రైతుల ఖాతాల్లో రైతు బంధు(Rythu Bandhu) డబ్బులు వేస్తామని చెప్పి ఇంకా వేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు(BRS Cadre), కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడడం దారుణమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి ద్వారా నిధులను మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక చొరువ తీసుకున్నారని వివరించారు. విద్యా, వైద్యానికి నాటి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా హరి నాధ్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.