కందుకూరు : కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యాంటీలను నమ్మి కష్టాలను తెచ్చుకోవద్దని నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita reddy) ఓటర్లకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కందుకూరు మండలం నేదునూరు, మాన్యగూడ, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, ఊట్లపల్లి సార్లరావులపల్లి, దెబ్బడగూడ, కందుకూరు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పడరాని పాట్లు పడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యాంటీలను నమ్మి కష్టాలను తెచ్చుకోవద్దని, కర్నాటక ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వివరించారు. అధికారంలోకి రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని అన్నారు. కర్ణాటకలో మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అన్నారు.
రాష్ట్రానికి సీఎం కేసీఆర్(CM KCR) పాలన కావాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోరే కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.