వికారాబాద్, డిసెబర్ 12 : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి సంతకాలు చేశారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ మంగీ లాల్, ఆర్డీవో వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీ నారాయణ , ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతి నిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.