వికారాబాద్, అక్టోబర్ 26 : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా ట్రయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మందికిపైగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని, దేశ శ్రేయస్సు ఆరోగ్యకరమైన జనాభా పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధమొక్కలకు నిలయమని, ఇక్కడి గాలి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు.
ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు 5కే, 10కే, 20కే, 32కే రన్ నిర్వహించి పతకాలు బహుకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంట్రీ గేట్ బాగుందని ప్రశంసిస్తూ, పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, అడిషనల్ ఎస్ పి రాము నాయక్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ , హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.