చేవెళ్లటౌన్, డిసెంబర్ 29 : చేవెళ్ల బస్టాండ్ విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం చేవెళ్లలోని బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మినీ స్టేడియాన్ని నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల బస్టాండ్ వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో విస్తరణ కోసం ప్రభుత్వం రూ.3 కోట్ల హెచ్ఎండీఏ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అధికారులు వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ అవరణలోనే కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అందరికీ అన్ని వసతులు కల్పించేలా.. తెలంగాణలోనే గ్రీన్ బస్టాండ్గా మార్చుకుందామని తెలిపారు. అలాగే చేవెళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మినీ స్టేడియం అసంపూర్తి పనులు, వాకింగ్ ట్రాక్ను తన సొంత నిధులతో అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతి, మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్లు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు.