తాండూరు రూరల్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం, కోటబాసుపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 1,200 పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సూచించామన్నారు. ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్బోర్డు, మంచినీటి సౌకర్యం, రంగులు వేయడం, ఫర్నిచర్ వంటివి పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 38 మోడల్ పాఠశాలలకుగాను 19 పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిమెట్టు కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యాబోధన మెరుగ్గా జరుగుతున్నదన్నారు. ఉపాధ్యాయులందరూ సమిష్టిగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో మహేశ్వర్వం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తారా ? అనే ప్రశ్నకు పై విధంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ్ల జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. తాండూరులో పార్టీలో విభేదాలు లేవని అందరూ సమిష్టిగానే ఉన్నారని.. ఒక ప్రశ్నకు జవాబుగా పేర్కొన్నారు. ఎస్టీ టీచర్లకు జీవో నం.33 ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు యత్నిస్తామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళాతామని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్కు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.